
పండగ ఇంకా పది రోజులే.. పనులు జరిగేనా...!
సాలూరు: శ్యామలాంబ పండగ నిర్వహణ కోసం అప్పు రూపేనా రూ.2కోట్లు మంజూరైనా ఎటువంటి పనులు ఇప్పటికీ చేపట్టకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వివరాల్లోకి వెళ్తే.. మున్సిపాలిటీలో శ్యామలాంబ పండగ ఈ నెల 18, 19, 20 తేదీల్లో జరగనుంది. 15 ఏళ్ల తరువాత జరగనున్న అమ్మవారి పండగకు లక్షల్లో భక్తులు వచ్చే అవకాశం ఉంది. ఈ క్రమంలో పండగ ఏర్పాట్లకు సంబంధించి తగు ఏర్పాట్లు చేయడంలో అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై చర్చ జరుగుతోంది. రెండు శాఖలకు మంత్రిగా ఉన్న సంధ్యారాణి ప్రభుత్వం నుంచిగానీ.. తన సొంత శాఖలగానీ ప్రత్యేక గ్రాంట్లు తీసుకువస్తారని అంతా భావించారు. అయితే ఆ గ్రాంట్లు రాలేదు. మున్సిపాలిటీకి గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో 2019, 2020 సంవత్సరాలకు సంబంధించి బీపీఎస్, ఎల్ఆర్ఎస్ 2020 గ్రాంట్లకు సంబంధించి రూ.2 కోట్లు అప్పు రూపేనా ఈ ప్రభుత్వంలో మంజూరైందని అధికారులు తెలిపారు. ఈ రెండు కోట్లు అప్పు కావడంతో మున్సిపాలిటీలో నిధులు ఉన్నప్పుడు తిరిగి ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది.
పది రోజుల్లో 76 పనులు జరిగేనా?
పండగ ఏర్పాట్లకు సంబంధించి సుమారు రూ.కోటి 30 లక్షలతో చేపట్టాల్సిన 76 పనులకు అధికారులు టెండర్లు పిలిచారు. ఈ నెల 9న టెండర్లు ఖరారు కానున్నాయి. 10, 11 తేదీలు సెలవులు కావడంతో టెండర్లు ఆమోదించి, ఒప్పందం వంటి ప్రక్రియలు పూర్తయి పనులు ప్రారంభించేందుకు ఈ నెల 12 అవుతుంది. 18వ తేదీన పండగ ప్రారంభం కానున్న నేపథ్యంలో 17వ తేదీకే పనులు పూర్తి చేయాల్సి ఉంది. అంటే కేవలం వారం రోజుల్లోనే పనులు పూర్తి చేయాల్సి ఉంటుంది. పనుల్లో ఎక్కువగా సీసీ రోడ్లు, కల్వర్టులు, పైలట్ వాటర్ స్కీంలు ఉన్నాయి. వారం రోజుల్లో ఈ పనులు జరిగేనా.. అని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
అంతా హడావుడే..
ఇదిలా ఉండగా పండగ కోసం ఈ ఏడాది జనవరిలో రూ.1.50 కోట్లు బుడా నుంచి నిధులు వస్తున్నాయని, ప్రతిపాదనలు సిద్ధం చేయమని మంత్రి సంధ్యారాణి తెలపడంతో అప్పట్లో అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. తరువాత నిధులు తగ్గాయని రూ.1.05 కోట్లతో ప్రతిపాదనలు చేయమనడంతో అధికారులు ప్రతిపాదనలు మార్చారు. అయితే ఈ నిధులు రాని పరిస్థితుల్లో ఏప్రిల్ నెలలో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో 2019, 2020 సంవత్సరాల ఎల్ఆర్ఎస్, బీపీఎస్ గ్రాంట్లకు సంబంధించి నిధులు రూ.2కోట్లు అప్పు రూపేనా ఈ ప్రభుత్వంలో మంజూరు కావడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. వీటితో అధికారులు మళ్లీ ప్రతిపాదనలు సిద్ధం చేశారు. మొత్తం 81 పనులకు ప్రతిపాదనలు చేయగా కోటి 30 లక్షల రూపాయిలతో 76 పనులకు ఈ నెల 9న టెండర్లు ఖరారు కానున్నాయి. అయితే కూటమి ప్రభుత్వంలో బిల్లుల చెల్లింపులో జాప్యం జరుగుతుండడంతో ఈ పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు ఎంత వరకు ముందుకు వస్తారో వేచి చూడాల్సి ఉంది. టెండర్లు ఖరారైనా.. వారం రోజుల్లో ఎలా పనులు చేస్తారన్న సందేహాలు లేకపోలేదు. ఈ క్రమంలో తాజాగా సింహాచలంలో వారం రోజుల్లో గోడ కట్టిన సంఘటనలను స్థానికులు గుర్తు చేసుకుంటున్నారు. ఏం జరుగుతుందో.. వేచి చూడాలి.
శ్యామలాంబ పండగ పనులకు ఈ నెల 9న టెండర్ల ఖరారు