
సిరిమానోత్సవానికి వేళాయె..
పార్వతీపురం టౌన్: పార్వతీపురం గ్రామదేవతలు ఇప్పల పోలమ్మ, ఎర్ర కంచెమ్మ, బంగారమ్మ అమ్మవార్ల ఉత్సవాలు చివరి ఘట్టానికి చేరుకున్నాయి. మంగళవారం సాయంత్రం నేత్రపర్వంగా జరగనున్న సిరిమానోత్సవానికి సర్వం సిద్ధమైంది. సుమారు రెండు లక్షల మంది భక్తులు ఉత్సవంలో పాల్గొనవచ్చని పోలీస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఆ మేరకు 450 మంది పోలీసులను బందోబస్తు విధులకు నియమించారు.
భక్తిశ్రద్ధలతో తొలేళ్ల ఉత్సవం
అమ్మవారి సిరిమానోత్సవానికి ముందురోజు సోమవారం నిర్వహించిన తొలేళ్ల ఉత్సవాన్ని భక్తులు భక్తిశ్రద్ధలతో జరిపారు. పట్టణానికి చెందిన రైతులు విత్తనాలను అమ్మవారి వద్దకు తీసుకురాగా, ముత్యాల ఘటాన్ని తెచ్చిన తర్వాత అమ్మవారి ఆలయ ప్రాంగణంలో తొలేరు ఉత్సవం నిర్వహించారు. అమ్మవారి వద్ద విత్తనాలను ఉంచి పూజ చేశారు. అనంతరం రైతులకు విత్తనాలు అందజేశారు. వీటిని ఖరీఫ్లో జల్లే విత్తనాల్లో కలిపి సేద్యం చేస్తే పంటలు కలిసివస్తాయన్నది రైతుల నమ్మకం.
5 గంటలకు సిరిమానోత్సవం ప్రారంభం
సిరిమానోత్సవం మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రారంభమవుతుందని ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. సిరమాను తిరిగే ప్రధాన రహదారితో పాటు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ నిబంధనలు అమల్లో ఉంటాయన్నారు. స్థానిక బాబూ జగ్జీవన్రామ్ కూడలి నుంచి పాత బస్టాండ్, రాయిగడ కూడలి వరకు రాకపోకలు పూర్తిగా నిలిపివేస్తామన్నారు.
రాకపోకలు ఇలా..
సిరిమానోత్సవ సమయంలో కృష్ణపల్లి గ్రామానికి వెళ్లాల్సిన వారు ఆర్టీసీ కాంప్లెక్స్ మీదుగా బైపాస్ రోడ్డు, సౌందర్య థియేటర్ రోడ్డులో వెళ్లాల్సి ఉంటుందని పోలీస్ అధికారులు తెలిపారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు లారీ, ఆటో తదితర వాహన యూనియన్లు సహకరించాలని కోరారు. సమస్యలు వస్తే తక్షణమే పోలీసులను సంప్రదించాలని సూచించారు.
నేడు ముగ్గురు అమ్మవార్ల సిరిమానోత్సవం
ఏర్పాట్లు పూర్తిచేసిన అధికారులు
ఘనంగా తొలేళ్ల ఉత్సవం