తోటపల్లి నిర్వాసితుల సమస్యలు పరిష్కరించండి | - | Sakshi
Sakshi News home page

తోటపల్లి నిర్వాసితుల సమస్యలు పరిష్కరించండి

Jun 3 2025 5:37 AM | Updated on Jun 3 2025 5:37 AM

తోటపల్లి నిర్వాసితుల  సమస్యలు పరిష్కరించండి

తోటపల్లి నిర్వాసితుల సమస్యలు పరిష్కరించండి

పార్వతీపురం టౌన్‌: తోటపల్లి బ్యారేజీ నిర్వాసిత గ్రామమైన పిన్నింటి రామినాయుడువలస గ్రామ సమస్యలు పరిష్కరించాలని తోటపల్లి నిర్వాసితుల సంఘం జిల్లా కన్వీనర్‌ బంటు దాసు డిమాండ్‌ చేశారు. ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ కింద ఇళ్ల నిర్మాణ బిల్లులు చెల్లించాలని కలెక్టర్‌ శ్యామ్‌ప్రసాద్‌కు సోమవారం వినతిపత్రం అందజేశారు. గతేడాది ఏప్రిల్‌ 28న, ఈ ఏడాది మే 12న నిర్వాసిత గ్రామ ప్రజల సమస్యలను విన్నవించినా ఒక్కటీ పరిష్కరించకపోవడం విచారకరమన్నారు. సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

తులసిరామినాయుడువలసలో ఏనుగుల గుంపు

గరుగుబిల్లి: మండలంలోని తులసిరామినాయుడువలస గ్రామ సమీపంలో ఏనుగులు సోమవారం సంచరించాయి. వారం రోజులు గా నందివానివలస, సుంకి, సంతోషపురం, గొట్టివలస, తదితర గ్రామాల్లో ఏనుగులు సంచరిస్తూ పంటలకు నాశనం చేస్తున్నాయి. ఖరీఫ్‌ సీజన్‌లో పొలాలకు వెళ్లేందుకు రైతులు భయపడుతున్నారు. ప్రభుత్వం స్పందించి ఏనుగులు తరలించాలని కోరుతున్నారు.

పార్వతీపురం ఎమ్మెల్యేపై మహిళ ఫిర్యాదు

అసభ్యకర మాటలతో మానసిక క్షోభకు గురి చేశారని ఆవేదన

సాక్షి, పార్వతీపురం మన్యం/పార్వతీపురం రూరల్‌: పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర తనతోపాటు, ఇద్దరు మహిళలను కించపరిచేలా, సభ్య సమాజం తల దించుకునేలా జుగప్సాకరమైన వ్యాఖ్యలను పత్రికా ముఖంగా చేశారని నియోజకవర్గంలోని పెద బొండపల్లికి చెందిన చుక్క శ్రీదేవమ్మ గ్రామీణ పోలీస్‌ స్టేషన్‌లో సోమవారం ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ప్రస్తుతం విజయనగరంలో నివాసం ఉంటున్నానని.. గతంలో తాను వ్యాపారం నిమిత్తం స్వగ్రామంలో ఏర్పాటు చేసుకున్న పరిశ్రమలను, తోటలను ఎమ్మెల్యే విజయచంద్ర ధ్వంసం చేశారని.. నివాస గృహాన్ని సైతం జేసీబీలతో కూల్చి వేశారని.. దీనిపై తాను న్యాయ పోరాటం చేస్తున్నానని ఆమె వివరించారు. ఏడాది కాలంలో తనతోపాటు.. మరో ఇద్దరు మహిళలను ఎమ్మెల్యే విజయచంద్ర వేధించారని గత నెల 19న మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు మీడియా సమావేశంలో ప్రస్తావించారని తెలిపారు. దీనిపై మరుసటి రోజు పార్వతీపురం శాసన సభ్యుడు విజయ చంద్ర మీడియా సమావేశం పెట్టి.. మహిళలని కూడా చూడకుండా అభ్యంతరకర వ్యాఖ్యలు తమపై చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే వ్యాఖ్యలు తనను తీవ్రంగా బాధించాయని, మానసిక వేదన కలిగించాయని వాపోయారు. తనకు న్యాయం చేయాలని ఫిర్యాదులో ఆమె పేర్కొన్నట్లు తెలిసింది. ఇదే విషయమై శ్రీదేవమ్మ వద్ద ప్రస్తావించగా.. ఎమ్మెల్యే వ్యాఖ్యలను ఖండిస్తూ తాను ఫిర్యాదు అందజేసినట్లు స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement