
బొలెరోను ఢీకొట్టిన బైక్: ఒకరి మృతి
విజయనగరం క్రైమ్: నగరంలోని ఆర్టీఓ ఆఫీస్ వద్ద గురువారం బొలెరో వాహనాన్ని బైక్ ఢీ కొట్టిన ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. మరో ఇద్దరు గాయాలపాలయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను వన్టౌన్ సీఐ శ్రీనివాస్ తెలియజేశారు. కొండకరకాం గ్రామానికి చెందిన ప్రమోద్, చిన్నారావు, సునీల్ బుల్లెట్పై విజయనగరంలో పని చూసుకుని తిరిగి గ్రామానికి వెళ్తున్న క్రమంలో ఆర్టీఓ ఆఫీస్ వద్ద ఓ బొలెరో వాహనం అకస్మాత్తుగా రోడ్పైకి వస్తుండగా త్రిబుల్ రైడింగ్ చేస్తున్న ఈ ముగ్గురు బైక్తో ఢీకొట్టారు. దీంతో బైక్పై ఉన్న ముగ్గురిలో చిన్నారావు కింద పడిపోగా మిగిలిన ఇద్దరూ పక్కకు పడిపోయారు. చిన్నారావుకు మాత్రం శరీరం మధ్యబాగంలో తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే 108కి సమాచారం ఇవ్వగా గాయపడిన వ్యక్తులను తిరుమల మెడికవర్కు చికిత్స కోసం తరలించారు. తీవ్రంగా గాయపడిన చిన్నారావు చికిత్స పొందుతూ మృతి చెందాడు. మిగిలిన ఇద్దరూ చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు.
రొటోవేటర్ కిందపడి వ్యక్తి దుర్మరణం
సీతానగరం: మండలంలోని కామందొరవలసలో గురువారం ట్రాక్టర్తో దుక్కి చేస్తున్న సమయంలో రొటోవేటర్కు ఉన్న గడ్డి తీస్తుండగా ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. ఈ సంఘటనపై పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కామన్న దొరవలస గ్రామానికి చెందిన బురిడి రామారావు(46) తన పొలంలో దుక్కిదున్నే నిమిత్తం ట్రాక్టర్ను రప్పించుకున్నాడు. ఆ ట్రాక్టర్ వెనుకనున్న రొటోవేటర్కు తగిలిన గడ్డిని తీయమని ట్రాక్టర్ డ్రైవర్ రామారావుకు సూచించడంతో రామారావు రొటొవేటర్ గడ్డి తీస్తుండగా డ్రైవర్ నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడంతో రొటోవేటర్కున్న బ్లేడ్లు ఆయన ఛాతీపైన బలంగా తగలడంతో కిందపడి మృతిచెందాడు. ఈ సంఘటనపై మృతుడి కుమారుడు తిలక్కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్రాస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై ఎం. రాజేష్ తెలియజేశారు. మృతుడికి తల్లి, భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు.
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
కొత్తవలస: అరకు–విశాఖపట్నం జాతీయ రహదారిలో కొత్తవలస మండలంలోని తాడివానిపాలెం గ్రామం సమీపంలో ఈ నెల రెండవ తేదీన జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన జి.వెంకటరమణ (63) చికిత్స పొందుతూ గురువారం మృతి చెందారు. కొత్తవలసలోని వసంత్విహార్ ప్రాంతానికి చెందిన వెంకటరమణ విశాఖపట్నంలో గల కూతురి ఇంటికి ద్విచక్రవాహనంపై వెళ్లి తిరిగి వస్తుండగా తాడివానిపాలెం వద్ద ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును తప్పించబోయి పక్కనే గల చెట్టును బలంగా ఢీకొట్టారు. దీంతో తీవ్ర గాయాల పాలైన ఆయనను 108 వాహనంలో విశాఖపట్నంలో గల ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్సపొందుతూ మృతిచెందారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
మరో ఇద్దరికి తీవ్రగాయాలు

బొలెరోను ఢీకొట్టిన బైక్: ఒకరి మృతి

బొలెరోను ఢీకొట్టిన బైక్: ఒకరి మృతి