
సమస్యలు పరిష్కరించండి
● జేసీకి తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్ సిబ్బంది వినతి
పార్వతీపురం టౌన్: తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్ 102 వాహన సిబ్బంది సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి యమ్మల మన్మథరావు డిమాండ్ చేశారు. కలెక్టర్ కార్యా లయం వద్ద శుక్రవారం నిరసన తెలిపారు. అనంతరం జేసీ శోభికకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్లో పనిచేస్తున్న కెప్టెన్స్కు తొమ్మిదేళ్లుగా రూ.7,870 జీతం మాత్రమే ఇస్తున్నారన్నారు. జీతం రూ.18,500కు పెంచి చట్ట ప్రకారం వీక్లీ ఆఫ్లు, పండగ, జాతీయ సెలవు లు అమలు చేయాలని కోరారు. విధి నిర్వహణ కు అవసరమైన సెల్ ఫోన్ ఇవ్వాలని, ప్రభుత్వ మే రీచార్జి చేయించాలన్నారు. వాహనాల మరమ్మతులకు అయ్యే సొమ్మును యాజమాన్యమే భరించాలన్నారు. కార్యక్రమంలో కోశాధికారి గొర్లి వెంకటరమణ, యూనియన్ నాయకుడు శ్రీధర్, వేణు, భాస్కరరావు, మోహన్రావు, సన్యాసి, లోకేష్, వెంకట్నాయుడు, వాసు, తిరుపతిరావు, సంతోష్కుమార్, బుజ్జి తదితరులు పాల్గొన్నారు.
మలేరియా నియంత్రణే ధ్యేయం
● డీఎంహెచ్ఓ భాస్కరరావు
పార్వతీపురం రూరల్: జిల్లాలో మలేరియా నియంత్రణే లక్ష్యంగా ఐఆర్ఎస్ను పక్కాగా నిర్వహించాలాని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికా రి ఎస్.భాస్కరరావు అన్నారు. పార్వతీపురం మండలం జిల్లేడువలస గ్రామంలో ఐఆర్ఎస్ స్ప్రేయింగ్ కార్యక్రమాన్ని శుక్రవారం పరిశీలించారు. ఇంటింటా దోమల నివారణ మందు పిచికారీ చేయాలని సిబ్బందికి సూచించారు. ఐఆర్ఎస్ ఆవశ్యకతను గ్రామస్తులకు తెలియజేశారు. ఏసీఎం ద్రావణం పిచికారీ చేస్తున్న సిబ్బంది మాస్క్, కళ్లజోళ్లు, చేతి తొడుగులు ధరించాలన్నారు. జిల్లా వ్యాప్తంగా 915 గ్రా మాల్లో దోమలనివారణ మందు పిచికారీ చేస్తామని, మొదటివిడత ఈ నెల 1న ప్రారంభమై న కార్యక్రమం వచ్చే నెల 15 వరకు షెడ్యూల్ ప్రకారం కొనసాగుతుందని తెలిపారు.
గోచక్క, డోకిశీల ఆరోగ్య కేంద్రాల పరిశీలన
గోచెక్క, డోకిశీల గ్రామీణ ఆరోగ్య కేంద్రాలను డీఎంహెచ్ఓ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించారు. ఓఆర్ఎస్, మందుల నిల్వల లభ్యతను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా మలేరియా నివారణ అధికారి వై.మణి, పీహెచ్ సీ వైద్యాధికారులు ఐశ్వర్య, కె.కౌశిక్, సబ్ యూనిట్ అధికారి ధనుంజయ, ఎంటీఎస్ రామకృష్ణ, సూపర్వైజర్లు కృష్ణంరాజు, జయ, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
ఎంజేపీఏపీ సెట్కు 599 దరఖాస్తులు
నెల్లిమర్ల: జిల్లాలో ఎంజేపీఏపీ సెట్కు 599 దరఖాస్తులు అందినట్టు మహాత్మా జ్యోతిబాపూలే బీసీ సంక్షేమ గురుకులాల జిల్లా కన్వీనర్ డాక్టర్ కేబీబీ రావు శుక్రవారం తెలిపారు. ఈ నెల 4న ఉదయం 10 నుంచి 12.30 గంటల వరకు ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామన్నారు. అందులో మార్కుల ఆధారంగా నెల్లిమర్ల బాలికల జూనియర్ కళాశాలలో ఇంటర్మీడిలో ప్రవేశాలు కల్పిస్తామని చెప్పారు.

సమస్యలు పరిష్కరించండి