
గంగపుత్రుల బెంగ..!
● ఫ్లోటింగ్ జెట్టీ నిర్మాణానికి గ్రహణం
● గతంలోనే రూ.23 కోట్లు మంజూరు
● శంకుస్థాపన చేసిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం
● అధికారంలోకి వచ్చి 11 నెలలవుతున్నా ఊసెత్తని కూటమి
● అవస్థలు పడుతున్న గంగపుత్రులు
పూసపాటిరేగ: జిల్లాలోని తీరప్రాంతం చింతపల్లికి మంజూరైన ఫ్లోటింగ్ జెట్టీ నిర్మాణానికి గ్రహణం పట్టింది. పది నెలల క్రితం గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం హయాంలో చింతపల్లికి రూ.23 కోట్లుతో జెట్టీని మంజూరు చేశారు. అన్ని అడ్డంకులు తీరి ఆర్థికశాఖ అనుమతులు వచ్చిన తరువాత అప్పట్లో సీఎంగా ఉన్న వైఎస్ జగన్మోహన్రెడ్డి వర్చువల్ విధానంలో ఫ్లోటింగ్ జెట్టీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 11నెలలవుతున్నా ఫ్లోటింగ్ జెట్టీ నిర్మాణం ఊసెత్తలేదు. జిల్లాలో తీరప్రాంత మత్స్యకారులు ప్రధాన అవసరమైన ఫ్లోటింగ్ జెట్టీ నిర్మాణంపై ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జెట్టీ నిర్మాణం కాకపోవడం, తరచూ తుఫాన్ హెచ్చరికలు జారీ అవడం వంటి కారణాలతో తీరప్రాంతం వీడి సుమారు 3 వేల మంది మత్స్యకారులు వలసబాట పట్టారు. జిల్లాలో తీరప్రాంతమైన పూసపాటిరేగ, భోగాపురం మండలాల్లో సుమారు 21 వేల మంది మత్స్యకారులు జీవిస్తున్నారు. వారిలో 6 వేల మంది చేపల వేటనే ప్రధాన వృత్తిగా చేసుకుని జీవిస్తున్నారు. వారిపై పరోక్షంగా 15 వేల మంది ఆధారపడి ఉన్నారు. పూసపాటిరేగ, భోగాపురం మండలాల్లో 885 బోట్లలో సుమారు 3798 మంది మత్స్యకారులు నిత్యం వేటను సాగిస్తుంటారు. వేటలేక వివిధ కారణాల రీత్యా మరో 3 వేల మంది మత్స్యకారులు బతుకు తెరువుకోసం విశాఖ, గుజరాత్ , హీరావళి, సూరత్ తదితర ప్రాంతాలకు వలస వెళ్లారు. తీరంలో జెట్టీ లేకపోవడంతో విపత్తుల సమయంలో పడవలు, వలలు సముద్రంలో కొట్టుకుపోయి నష్టాలు చవిచూస్తున్నామని పలువురు మత్స్యకారులు వాపోతున్నారు.
కాలుష్యంతో మత్స్యసంపద నాశనం
జెట్టీ సమస్యతో పాటు పరిశ్రమల వ్యర్థజలాలు తమ పొట్టలు కొడుతున్నాయని మత్స్యకారులు వాపోతున్నారు. రసాయన పరిశ్రములు వ్యర్థజలాలను సముద్రంలో కలిపేయడంతో మత్స్య సంపదకు తీవ్ర నష్టం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో చేపల వేటకు వెళ్తే భారీగా వలకు చేపలు చిక్కేవని నేడు ఆ పరిస్థితి లేదని చెబుతున్నారు. వేట సాగక పోవడంతో వలస వెళ్లే పరిస్థితి అని మత్స్యకారులు వాపోతున్నారు
తక్షణమే ఫ్లోటింగ్ జెట్టీ నిర్మించాలి
జెట్టీ లేకపోవడంతో వేట చేసిన తరువాత ఒడ్డుకు చేరిన పడవలకు రక్షణ లేకుండా పోయింది. ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు తీవ్ర నష్టాలు చవిచూస్తున్నాం. గత ప్రభుత్వంలో జెట్టీ నిర్మాణానికి నిధులు మంజూరు చేసి శంకుస్థాపన చేశారు. కూటమి ప్రభుత్వం జెట్టీ నిర్మాణంపై నిర్లక్ష్యం చేయకుండా నిర్మాణంపై తక్షణమే దృష్టిసారించాలి. బి.కొర్లయ్య, చింతపల్లి మత్స్యకారుడు.
మత్స్యకారులు అభివృద్ధి చెందాలి
అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఫ్లోటింగ్ జెట్టీ నిర్మాణాన్ని ప్రారంభించే దిశగా చర్యలు చేపట్టాలి. జెట్టీ నిర్మాణం పూర్తి చేసి మత్స్యకారులు జీవనోపాధి మెరుగుపరచాలి. బి. అప్పలస్వామి, మత్స్యకారుడు పతివాడ బర్రిపేట.