
రోగులపట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
పార్వతీపురంటౌన్: ప్రజలకు వైద్యులు అంటే దేవుళ్లని, అటువంటి వైద్యులు ప్రజలకు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండి వైద్యం అందించాలి. అప్పుడే ఆ దైవత్వానికి అర్థం ఉందని, ప్రతి చిన్న అనారోగ్య విషయానికి బయట టెస్టులు చేయించుకోవాలని పంపించడం సరికాదని, రోగులపట్ల వైద్యులు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు మంగళవారం ఆయన పార్వతీపురం ఏరియా ఆస్పత్రిని ఆకస్మిక తనిఖీ చేశారు. ముందుగా జిల్లా ప్రాంతీయ ఆస్పత్రిలోని ప్రతి వార్డును సందర్శించి ఆయా వార్డుల్లో ఉన్న రోగుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లల వార్డును, డయాలసిస్ వార్డును సందర్శించి రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులను ఆదేశించారు. అలాగే రోగుల బంధువులకు ఆయన ఆప్యాయంగా పలకరించి మీకు ఏమైనా ఆస్పత్రిలో సమస్యలు ఉన్నాయా అని అడగ్గా రోగుల బంధువులు సమాధానం అయోమయంగా చెప్పడంతో ఆవేదన వ్యక్తం చేశారు. ఆస్పత్రిలో రోగులకు ఎటువంటి సమస్యలు ఎదురైనా వెంటనే తన దృష్టికి తీసుకురావాలని ఆయన చెప్పడంతో రోగుల బంధువులు ఆనందం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో యందవ నిర్మల కుమారి, జొన్నాడ శ్రీదేవి, మంచిపల్లి సత్యనారాయణ, కౌన్సిల్ సభ్యులు బడే గౌరునాయుడు, సారిక గణేష్, ఏరియా హాస్పిటల్ వైద్యులు, సిబ్బంది టీడీపీ నాయకులు పాల్గొన్నారు.