
అధికార బలంతో అడ్డదారులు
పాలకొండ: నగర పంచాయతీ చైర్పర్సన్ ఎన్నిక కోసం కూటమి నాయకులు అడ్డదారులు తొక్కారని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, మాజీ ఎమ్మెల్యే విశ్వాసరా యి కళావతిలు ధ్వజమెత్తారు. కౌన్సిలర్లతో కలిసి పాలకొండ పట్టణంలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ బీ–ఫారంపై గెలిచిన ఆకుల మల్లీశ్వరి ని చైర్మన్గా ఎన్నుకుని కూటమి నాయకులు తాము గెలిచినట్లు ఆర్భాటం చేస్తున్నారని విమర్శించారు. కనీస సభ్యులు బలం లేకుండా కేవ లం అధికారం ఉందన్న ఒకే ఒక్క అహంకారంతో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. నగర పంచాయతీలో 17 మంది కౌన్సిలర్లు వైఎస్సార్సీపీవారే అన్న విషయాన్ని మర్చిపోవద్ద గుర్తు చేశారు. 2వ వార్డుకు చెందిన ఆకుల మల్లీశ్వరిని ప్రలోభపెట్టి, భయపెట్టి పార్టీ కండువా వేశారన్నారు. వైఎస్సార్సీపీ బీఫారం ఇస్తే టీడీపీ అభ్యర్థి ఎలా అవుతుందని ప్రశ్నించారు. ఈ ఎన్నికలో వైఎస్సార్ సీపీదే నైతిక విజయమన్నారు. తాము ఎప్పటికీ పట్టణం అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. కౌన్సిల్లో తమ పార్టీ అభ్యర్థులు పూర్తిస్థాయి మెజారిటీతో ఉన్న విషయాన్ని మర్చిపోవద్దన్నారు. సమావేశంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు వెలమల మన్మథరావు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
కూటమి నాయకులు ప్రజాసామ్యన్ని ఖూనీ చేశారు
నైతిక విజయం ఎవరిదో ప్రజలకు తెలుసు
ఎమ్మెల్సీ విక్రాంత్, మాజీ ఎమ్మెల్యే
కళావతి