అన్నింటిలోనూ అటెండర్‌! | - | Sakshi
Sakshi News home page

అన్నింటిలోనూ అటెండర్‌!

Apr 19 2025 9:36 AM | Updated on Apr 19 2025 9:36 AM

అన్నింటిలోనూ అటెండర్‌!

అన్నింటిలోనూ అటెండర్‌!

పంచాయతీరాజ్‌ ఇంజినీరింగ్‌ విభాగం పనులన్నీ చిరుద్యోగి

కనుసన్నల్లోనే..

అధికారులపైనా హూంకరింపు

మందు, విందుతో ప్రసన్నం

చేసుకుంటున్న వైనం

భార్య పేరుతో అధికారులకు అద్దెకార్లు

● దివ్యాంగ ఉద్యోగి స్థానంలో

అనధికారికంగా మరొకరి నియామకం

అదే వ్యక్తితో అధికారి ఇంటిలో వెట్టిచాకిరీ

ఆయన తీరును చూసి విస్తుపోతున్న ఉద్యోగ వర్గాలు

పార్వతీపురంటౌన్‌:

ఆయన జిల్లా పంచాయతీ రాజ్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో ఓ చిరుద్యోగి. అయితేనేం... ఆయనకు అందరూ సలాం చెప్పాల్సిందే. ఎదురు ప్రశ్నించేవారు అధికారి అయినా స్థానిక బలాన్ని అడ్డుపెట్టుకుని ముందు బెదిరిస్తారు. తర్వాత మందు, విందుతో మచ్చిక చేసుకుంటారు. తర్వాత అన్నీ తానై వ్యవహరిస్తారు. ఆ శాఖ పరిధిలో ఏ పని జరగాలన్నా ఆయన అనుమతి ఉండాల్సిందే. కమీషన్‌ ఇచ్చుకోవాల్సిందే.! సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులు ఒకే చోట మూడేళ్లు, ఐదేళ్లు పనిచేస్తే బదిలీలు జరగడం సహజం. ఆయన మాత్రం 20 ఏళ్లుగా అదే కార్యాలయంలో పాతుకుపోయారు. కొన్నేళ్లుగా చిరుద్యోగి సాగిస్తున్న దందా, అవినీతి పనులతో ఉద్యోగవర్గాలు కలవరపడుతుండగా, ఆయన మాత్రం ఆర్థిక శక్తిగా ఎదుగుతున్నారు.

అంతా వ్యాపారమే..

పంచాయతీరాజ్‌ ఇంజినీరింగ్‌ కార్యాలయాన్ని ఆ చిరుద్యోగి వ్యాపార కేంద్రంగా మార్చేశారు. ప్రశ్నించిన అధికారులపై స్థానిక నేతలతో ఫోన్‌ చేయించి బెదిరిస్తున్నారు. తన భార్యపేరిటి మూడు షిప్ట్‌ డిజైర్‌ కార్లను డీపీఆర్‌ఈఓ, మరో ఇద్దరు మండలాభివృద్ధి అధికారులకు ఎంగేజ్‌లో పెట్టినట్టు సమాచారం. ఇంజినీరింగ్‌ శాఖ పరిధిలో బిల్లుల అంచనా, ప్రతిపాదనలు, చెల్లింపుల్లో ఆయనదే పైచేయి. దీనికోసం అధిక

మొత్తంలో వసూళ్లుచేసి పై అధికారులకు అందజేసేందుకు మధ్యర్తిగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. తన పనులు, కారు బిల్లులు సకాలంలో పొందేందుకు అధికారులకు మందు, విందు ఇస్తున్నారు. కార్యాలయాన్ని బార్‌గా మార్చేశారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.

మన్ననలు పొందేందుకు...

అధికారుల మన్ననలు పొందేందుకు ఆ చిరుద్యోగి ఎంతకై నా తెగిస్తారని రుజువైంది. కార్యాలయ పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చేస్తారు. ఆ శాఖలో కీలక అధికారి అండదండలతో అదే శాఖలో పనిచేస్తున్న దివ్యాంగ నైట్‌వాచ్‌మన్‌ను బెదిరించి, ఆయన వద్ద నుంచి నెలకు రూ.10వేలు వసూలుచేస్తూ ఆ స్థానంలో వేరే ప్రైవేటు వ్యక్తిని నియమించారు. ఆ వ్యక్తితో కీలక అధికారి ఇంటిలో వెట్టిచాకిరీ చేయిస్తున్నారు. ఆ అధికారి మన్ననలు పొందుతూ తన పనులను చక్కబెట్టుకుంటున్నారు. బిల్లుల చెల్లింపులో రూ.లక్షలు దండి వాటాలు పంచుతున్నారన్నది ఆ శాఖ వర్గాల్లోనే కొందరు బహిరంగంగా చెబుతుండడం గమనార్హం. ఆయన తీరు అందరికీ తెలిసినా చర్యలు తీసుకునేందుకు వెనుకడుగువేస్తున్నారంటే ఆయన ఆర్థిక శక్తిని అర్థం చేసుకోవచ్చు. ఇలాగే వదిలేస్తే అందరికీ ‘టెండర్‌’ పెడతారని, కార్యాలయానికి మాయని మచ్చను తెస్తారని కొందరు ఉద్యోగులు చెబుతున్నారు.

చర్యలు చేపడతాం

పంచాయతీరాజ్‌ శాఖలో అటుంటి ఉద్యోగు లు ఉంటే వారిపై చర్యలు చేపడతాం. ఓ ఉద్యోగి సొంతకార్లు నడుపుతున్న విషయం తన దృష్టికి వచ్చింది. ప్రభుత్వ నిబంధనలకు ఇది విరుద్ధం. ఇతర అంశాలపైనా విచారణ చేపట్టి శాఖాపరమైన చర్యలు చేపడతాం.

– చంద్ర శేఖర్‌, జిల్లా పంచాయతీరాజ్‌ అధికారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement