
పుడమి పరవశించాలి
● పచ్చదనం ఫరిడవిల్లాలి
● ప్రకృతితో సహజీవనమే పర్యావరణ పరిరక్షణ
● నేడు పర్యావరణ దినోత్సవం
విజయనగరం గంటస్తంభం: ధరణీమాత భగభగ మండుతోంది. కన్నబిడ్డలు చేస్తున్న అకృత్యాలు భరించలేక ఆవేదన చెందుతోంది. లక్షలకొద్దీ హిరణాక్ష్యులను చూసి తల్లడిల్లుతోంది. భూమాత పెడబొబ్బలు మనకు వినబడవు. వాహనాల రొద వాటిని మింగేస్తోంది. ధరణి కన్నీరు కారుస్తోంది. మనకు కనబడదు. ఫ్యాక్టరీల పొగమబ్బులు కమ్ముకున్నాయి. అభివృద్ధి ముసుగు వేసుకున్న రక్కసి వికట్టాట్టహాసం చేస్తోంది. అన్నిటికీ ఒకటే సమాధానం గ్లోబల్ వార్మింగ్. ఇప్పుడు మానవాళి మేలుకోవాల్సిన సమయం వచ్చింది. ఉపేక్షిస్తే ఆ తల్లి మహోగ్రరూపం దాలుస్తుంది. అప్పుడంతా ప్రళయమే.
మన కాళ్లకింద వెయ్యి టన్నుల న్యూక్లియర్ బాంబులున్నాయి. వందల కొద్దీ హైడ్రోజన్ బాంబులున్నాయి. అవి ఏ క్షణంలోనైనా పేలవచ్చు. అదే జరిగితే భూమీమీద ఉన్న సమస్త జంతుజాలం, చెట్లు చేమలు నాశనమవుతాయి. భూమి ఓ మరుభూమిగా మారిపోతుంది. నివాసయోగ్యంగా లేని గ్రహంగా మిగిలిపోతుంది. ఇది మండిపోతున్న ధరణి భవిష్యవాణి. మనం చేసే తప్పిదాలకు ప్రకృతి అప్పుడప్పుడు తన ఉగ్రరూపాన్ని చూపిస్తున్నా అదిచ్చే ప్రమాద సంకేతాలను గుర్తించలేకపోతున్నాం. అసలు భూమాతను పరిరక్షించుకోవాలని, పర్యావరణాన్ని కాపాడుకోవాలన్న ఆలోచన ఇప్పుడొచ్చిందేమీ కాదు.అర్ధశతాబ్దం కిందటే ఐక్యరాజ్యసమితి పర్యావరణ పరిరక్షణ కోసం నడుం బిగించింది. సమితి జనరల్ అసెంబ్లీ జూన్ 5, 1972న పర్యావరణ దినోత్సవాన్ని ఏర్పాటు చేసింది. ప్రతి ఏడాది ఇదేరోజున ఏదైనా ఓ నగరంలో అంతర్జాతీయ సమావేశం నిర్వహించాలని నిర్ణయించింది. పర్యావరణ పరిరక్షణ అవసరాన్ని ప్రజలు, ప్రభుత్వం గుర్తించి తగు చర్యలు చేపట్టేలా ప్రోత్సహించడమే పర్యావరణ దినోత్సవ ముఖ్య ఉద్దేశం. ఇక అప్పట్నుంచి ప్రతి ఏడాది ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకుంటూ వస్తున్నాం. విషపూరిత వాయువులు వాతావరణంలో ఎక్కువ కావడంతో క్రమంగా భూమి కేడెక్కుతోంది. అడవులు, జల వనరులు తగ్గిపోతున్నాయి.
2025 థీమ్‘‘బీట్ ప్లాస్టిక్ పొల్యూషన్’’
2025లో ప్రపంచ పర్యావరణ దినోత్సవం జూన్ 5న జరుపుకుంటారు. ఈ సంవత్సరం థీమ్ ‘‘ప్లాస్టిక్ కాలుష్యాన్ని అంతం చేయండి’’ ప్లాస్టిక్ కాలుష్యం వల్ల పర్యావరణానికి, జీవులకు కలిగే నష్టం గురించి ప్రజలకు అవగాహన కల్పించడం, దీనిని అంతం చేయడానికి కృషి చేయడం.
ప్లాస్టిక్ భూతం..తరిమేద్దాం
భూమిని పట్టిపీడిస్తున్న ప్రమాదకర వస్తువు ప్లాస్టిక్. 100 మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉన్న ప్లాస్టిక్ కవర్ల వినియోగాన్ని కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. వ్యాపారులు మాత్రం విచ్చలవిడిగా విక్రయిస్తున్నారు. ప్లాస్టిక్ను కొంతమంది వ్యాపారులు రోడ్డుపైనే తగులబెడుతున్నారు. దీనివల్ల క్యాన్సర్ వంటి ప్రమాదకర వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. ఉమ్మడి విజయనగరం జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో రోజుకు 150 మెట్రిక్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు పోగవుతున్నాయి. విజయనగరం పట్టణంలో సేకరించిన చెత్త నుంచి ఎరువు, ఇంధనం తయారుచేసే ప్రతిపాదనలు ఉన్నా కార్యరూపం దాల్చడం లేదు. ప్లాస్టిక్ కవర్ల వినియోగాన్ని పూర్తిగా అరికట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది.
మొక్కలు నాటి సంరక్షించాలి
ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని సంరక్షించాలి. ఈ సంవత్సరం జిల్లాలో 20 లక్షలు మొక్కలు నాటాలని లక్ష్యం పెట్టుకున్నాం. మొక్కల పెంపకం వల్ల పర్యావరణం సమతుల్యత పెరిగి మానవ మనుగడకు ప్రాణాధారం అవుతాయి. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలి. స్వచ్ఛమైన, ఆహ్లాదరకమైన వాతావరణం కోసం నాటిన ప్రతి మొక్కను కాపాడుకోవాల్సిన బాధ్యతను ప్రతి ఒక్కరూ తీసుకోవాలి.
ఆర్.కొండల రావు, జిల్లా అటవీ శాఖ అధికారి

పుడమి పరవశించాలి

పుడమి పరవశించాలి