వెన్నుపోటుపై జనాగ్రహం | - | Sakshi
Sakshi News home page

వెన్నుపోటుపై జనాగ్రహం

Jun 5 2025 9:43 AM | Updated on Jun 5 2025 9:43 AM

వెన్న

వెన్నుపోటుపై జనాగ్రహం

● నమ్మి ఓటేసిన ప్రజలకు వెన్ను చూపారు.. ● వంచన మీ నైజం.. మిమ్మల్ని ఎలా నమ్మేది జనం! ● కూటమి ప్రభుత్వ ఏడాది పాలనపై వైఎస్సార్‌సీపీ నేతల ఆగ్రహం ● జిల్లా వ్యాప్తంగా నియోజకవర్గాల్లో ‘వెన్నుపోటు దినం’ నిరసన ర్యాలీలు ● వేలాదిగా తరలివచ్చిన పార్టీ శ్రేణులు, ప్రజలు

సాక్షి, పార్వతీపురం మన్యం:

‘కూటమి ప్రభుత్వం ఏడాది పాలనంతా నయవంచన, ద్వేషం, కక్షపూరితం. నమ్మి ఓటేసిన ప్రజలకు వెన్నుపోటు పొడిచారు. సూపర్‌ సిక్స్‌ పథకాలని ఊదరగొట్టి.. ఉత్తచేయి చూపారు. అన్ని వర్గాలనూ దారుణంగా మోసగించారు. అందుకే ఏడాదిలోనే కూటమి ప్రభుత్వాన్ని జనం ఛీ కొడుతున్నార’ని వైఎస్సార్‌సీపీ నాయకులు ధ్వజమెత్తారు. కూటమి ఏడాది పాలన.. ప్రజలకు చేసిన మోసంపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు బుధవారం జిల్లావ్యాప్తంగా ‘వెన్నుపోటు దినం’ నిర్వహించారు. నాలుగు నియోజకవర్గ కేంద్రాల్లో వేలాది మందితో ర్యాలీలు చేపట్టారు. దగా ప్రభుత్వ తీరును ఎండగడుతూ అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. ఏడాది కాలంగా సాగు తున్న అసమర్థ పాలనకు దుయ్యబడుతూ.. ఇచ్చిన హామీలు అమలు చేయాలని ప్రజల పక్షాన డిమాండ్‌ చేశారు.

●సాలూరు నియోజకవర్గంలో మాజీ ఉపముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యులు పీడిక రాజన్నదొర సారథ్యంలో నిర్వహించిన ర్యాలీ విజయవంతమైంది. సాలూరు పట్టణంలోని అఫీషియల్‌ కాలనీ నుంచి అంతరరాష్ట్ర రహదారి మీదుగా బోసు బొమ్మ కూడలిలోని దివంగత వైఎస్సార్‌ విగ్రహం వరకు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు ర్యాలీగా సాగారు. అనంతరం తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. దాదాపు ఐదు వేల మందితో సాగిన ర్యాలీ.. జనసంద్రాన్ని తలపించింది. కూటమి ప్రభుత్వానికి గట్టి హెచ్చరిక పంపింది.

●పార్వతీపురం జిల్లా కేంద్రంలో నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు ఆధ్వర్యంలో వైఎస్సార్‌ విగ్రహం నుంచి కలెక్టరేట్‌ వరకు వేలాది మందితో ర్యాలీ నిర్వహించారు. రెడ్‌బుక్‌ పాలనను నిరసిస్తూ.. సూపర్‌ సిక్స్‌ హామీలు అమలు చేయాలని కోరుతూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం సంయుక్త కలెక్టర్‌ ఎస్‌.ఎస్‌.శోభికకు ప్రజాప్రతినిధులతో కలసి వినతిపత్రం అందజేశారు.

●వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్‌రాజు, మాజీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి సూచనల మేరకు కురుపాం మండలంలో పార్లమెంట్‌ పరిశీలకులు బి.ప్రసాద్‌, ఎంపీపీలు దీనమయ్య, శెట్టి పద్మావతి, జెడ్పీటీసీ సభ్యులు జి.సుజాత తదితరుల ఆధ్వర్యంలో నాలుగు మండలాల నుంచి వేలాది మందితో ర్యాలీ చేపట్టారు. స్థానిక వైఎస్సార్‌ విగ్రహం నుంచి ప్రారంభమైన ర్యాలీ.. పాత బస్టాండ్‌ మీదుగా తహసీల్దార్‌ కార్యాలయం వరకు సాగింది.

● ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్‌, మాజీ ఎమ్మెల్యే విశ్వసరాయి కళావతి నాయకత్వంలో పాలకొండ నియోజకవర్గ కేంద్రంలోని విశాఖ–వీరఘట్టం రహదారి వైఎస్సార్‌ కూడలి నుంచి భారీ ర్యాలీగా కోట దుర్గమ్మ దేవస్థానం, ఆర్టీసీ కాంప్లెక్స్‌, యాలాం కూడలి మీదుగా సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లారు. అనంతరం సబ్‌ కలెక్టర్‌ కార్యాలయ సిబ్బందికి వినతిపత్రం అందజేశారు. అంతకుముందు దివంగత వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కూటమి పాలనకు వ్యతిరేకంగా నినదించారు.

మోసం చేశారు

సాధ్యంకాని హామీలతో ప్రజలను నమ్మించి కూటమి ప్రభుత్వం మోసం చేసింది. అధికారం చేపట్టి ఏడాది గడిచినా ఏ ఒక్క హామీనీ పూర్తిస్థాయిలో నెరవేర్చలేదు. ప్రజాసంక్షేమమన్న ఊసేలేదు. రాష్ట్రంలో ఏ ఒక్క వర్గం సంతోషంగా లేదు. వెన్నుపోటు దినం కార్యక్రమానికి హాజరై నిరసన తెలిపిన జనమే దీనికి నిలువెత్తు సాక్ష్యం.

– పాలవలస విక్రాంత్‌, ఎమ్మెల్సీ,

పాలకొండ, పార్వతీపురం మన్యం జిల్లా

పాలనలో కూటమి విఫలం

ప్రజాసంక్షేమ, అభివృద్ధి పాలనలో కూటమి ప్రభుత్వం విఫలమైంది. ఇచ్చిన హామీలు అమలుచేయకుండా ఒక ఏడా దిని గడిపేసింది. ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోంది. సాగు సాయం, తల్లికి వందనం, ఆడబిడ్డ నిధి, 50 ఏళ్లకే పింఛన్‌ వంటి పథకాలు అందజేయకపోవడం విచారకరం. రెడ్‌బుక్‌ రాజ్యాంగం ఎన్నాళ్లూ నడవదన్న విషయం వెన్నుపోటు దినానికి హాజరైన జనాన్ని చూస్తే తెలుస్తోంది. ఏడాదికే ప్రజావ్యతిరేకతను కూటమి ప్రభుత్వం మూటగట్టుకుంది.

– పీడిక రాజన్నదొర,

మాజీ డిప్యూటీ సీఎం, సాలూరు

మోసం ఫిక్స్‌చేశారు

కూటమి నాయకులు సూపర్‌ సిక్స్‌ అంటూ ఓటేసిన ప్రజలకు మోసం ఫిక్స్‌ చేశారు. దందాలు, దౌర్జ న్యాలతో కాలక్షేపం చేస్తున్నారు. దేశ చరిత్రలో ఇటువంటి నిరంకుశ, అరాచక పాలనను ఎన్నడూ చూడలేదు. ప్రజాసంక్షేమం, అభివృద్ధి లేకుండానే తొలిఏడాది కూటమి ప్రభుత్వం రూ.1.49లక్షల కోట్లు అప్పు చేయడం గమనార్హం.

– అలజంగి జోగారావు,

మాజీ ఎమ్మెల్యే, పార్వతీపురం

చేసింది శూన్యం

కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని విస్మరించింది. విద్య, వైద్య, పారిశ్రామిక, వ్యవసాయ రంగాలను నిర్లక్ష్యం చేస్తోంది. ఏ ఒక్క హామీని అమలుచేయలేదు. ఏడాదిగా ప్రజలు ఇబ్బంది పడుతున్నా పట్టించుకోవడం లేదు. కూటమి ప్రజావ్యతిరేక పాలన నుంచి విముక్తి కోరుతున్నారు. హామీలు అమలు చేయకుంటే రానున్న రోజుల్లో ఆందోళనలు అధికం కానున్నాయి. ఇచ్చిన హామీలు అమలుచేయమంటే కూటమి రెడ్‌బుక్‌ రాజ్యాంగంతో జనం గొంతునొక్కేస్తోంది.

– విశ్వాసరాయి కళావతి, మాజీ ఎమ్మెల్యే,

పాలకొండ నియోజకవర్గం

వెన్నుపోటుపై జనాగ్రహం 1
1/1

వెన్నుపోటుపై జనాగ్రహం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement