
ఎవరేమంటారో చూద్దాం!
● ప్రభుత్వ కార్యాలయాల్లో ‘రాజకీయాలు’ ● డీఈవో నియామకంపై విమర్శలు ● మున్సిపల్ కమిషనర్పై ఫిర్యాదుల వెల్లువ ● పుష్కలంగా కూటమి నేతల అండదండలు ● పట్టించుకోని ఉన్నతాధికారులు!
సాక్షి, పార్వతీపురం మన్యం:
జిల్లాలోని అధికారులను కూటమి ప్రజాప్రతినిధులు తమ తొత్తులుగా మార్చుకున్నారు. అడ్డగోలు నియామకాలతో ప్రభుత్వ శాఖలను భ్రష్టుపట్టిస్తున్నారు. ప్రజల నుంచి వ్యతిరేకత వస్తున్నా.. ప్రజా సంఘాలు ఫిర్యాదులు చేస్తున్నా ఉన్నతాధికారులు సైతం ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పలు శాఖల్లో నియామకాలు, ఉద్యోగుల వ్యవహార శైలి ఇందుకు ఊతమిస్తోంది.
విద్యాశాఖలో రాజకీయ రంగు
పదో తరగతి ఫలితాల్లో వరుసగా మూడేళ్లు జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. అటువంటి విద్యాశాఖ కు సుమారు రెండు నెలలుగా రెగ్యులర్ డీఈవో లేరు. గత మార్చి 31న ఎన్.తిరుపతినాయుడు ఉద్యోగ విరమణ పొందాక.. ఆ పోస్టు రాజకీయాలతో నలిగిపోతోంది. కొన్నాళ్లు డీఈవో కార్యాలయంలోనే సహాయ సంచాలకులుగా వ్యహరిస్తున్న రమాజ్యోతికి ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం ఆమెను తప్పించి, ఎంఈవో స్థాయి రాజ్కుమార్ను ఇన్చార్జి డీఈవోగా నియమించారు. వాస్తవానికి రాజ్కుమార్ నియామకం జిల్లాలోని అధికార పార్టీకి చెందిన ఓ కీలక నేత నిర్ణయం ప్రకారం జరిగినట్లు ప్రచారం ఉంది. తొలుత గత ఏప్రిల్ 14నే ఆయనను నియమిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. అర్హత గలవారు ఉన్నప్పటికీ.. ఒక జూనియర్కు ఆ బాధ్యతలు అప్పగించడంపై వ్యతిరేకత రావడంతో ఉత్తర్వులను హోల్డ్లో పెట్టారు. అంతా సద్దుమణిగాక గత నెల 20వ తేదీన గుట్టుగా అదే వ్యక్తిని నియమిస్తూ, మరలా అవే ఉత్తర్వులను జారీ చేయడం గమనార్హం. దీనిని ప్రజాసంఘాలు తప్పుబడుతున్నాయి. మరోవైపు విద్యాశాఖలోనే ఏళ్లుగా ఓ వ్యక్తి చక్రం తిప్పుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. గతంలో వేరే చోటకు బదిలీపై పంపుతున్నా.. తనకున్న పలుకుబడితో డిప్యుటేషన్పై మరలా జిల్లా విద్యాశాఖకే వస్తుండటంపై ఆ శాఖలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదే వ్యక్తిపై గతంలో అనేక అవినీతి ఆరోపణలు బయటకు వచ్చాయి. అధికారులు చర్యలు తీసుకోవాల్సింది పోయి.. కొద్దిరోజులుగా కలెక్టరేట్లో జరుగుతున్న అభివృద్ధి పనుల కాంట్రాక్టునూ ఆయ న కుటుంబ సభ్యులకే అప్పగించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జిల్లా ఉన్నతాధికారులు, రాజకీయ నేతల అండదండలు పుష్కలంగా ఉండటం వల్లే అతను చక్రం తిప్పుతున్నారని భోగట్టా. రాష్ట్రవ్యాప్తంగా విద్యారంగంలో పేరు సంపాదించిన పార్వతీపురం మన్యం విద్యాశాఖను రాజకీయ చేయడంపై ప్రజాసంఘాలు పోరాటం చేస్తున్నాయి. ఇటీవల గిరిజన, విద్యార్థి, ప్రజా సంఘాల నాయకుల ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. రెగ్యులర్ డీఈవోను నియమించాలని.. డిప్యుటేషన్పై జిల్లా కార్యాలయంలో పని చేస్తున్న ఎస్జీటీ శంకరరావును వెనక్కి పంపించాలని డిమాండ్ చేశారు.
●పార్వతీపురం ఐటీడీఏ పరిధిలోని ఎస్.కోట, బొబ్బిలి గిరిజన కళాశాల వసతిగృహాల్లో ఏళ్ల తరబడి ఇద్దరు వ్యక్తులే హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లుగా విధులు నిర్వహిస్తుండటం గమనార్హం. వారిని గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలకు బదిలీ చేయాలన్న డిమాండ్లు వస్తున్నా.. అధికారులు పట్టించుకోవడం లేదు. ‘డిప్యుటేషన్’ పేరుతో 13 ఏళ్లపాటు ఒకే చోట తిష్ట వేశారు. మరలా ఇటీవల జరిగిన బదిలీల్లో అక్కడకే పోస్టింగులు తెచ్చుకున్నారు. వారిద్దరూ మరో ఐదేళ్లు ఇక్కడే పని చేయ డానికి లైసెన్సులు తెచ్చుకున్నారని, ఇలాంటప్పుడు బదిలీలు ఎందుకు.. నిబంధనలెందుకుని గిరిజన సంక్షేమ సంఘం నాయకులు ప్రశ్నిస్తున్నారు.
పార్వతీపురం కమిషనర్ తీరే వేరు!
పార్వతీపురం పురపాలక సంఘ కమిషనర్ వెంకటేశ్వర్లు ఇక్కడ విధుల్లో చేరిన నాటి నుంచి ఆయన వ్యవహారశైలిపై విమర్శలు వ్యక్తమవుతూ నే ఉన్నాయి. అధికార పార్టీ ఎమ్మెల్యే కనుసన్నల్లో నడుస్తున్నారని.. ఇటీవల మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్మన్లు, వైఎస్సార్సీపీ సభ్యులు బహిరంగంగానే తెలిపారు. వైఎస్సార్సీపీ సభ్యుల పట్ల నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. బడ్జెట్, సాధారణ సమావేశాలు సైతం నిర్వహించకుండా అభివృద్ధికి అడ్డు తగులుతున్నారని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. కమిషనర్ వైఖరిపై పలు ప్రజాసంఘాల నాయకులు సైతం ఇటీ వల ఆ శాఖ ఆర్డీకి లిఖితపూర్వకంగా ఫిర్యాదు అందజేశారు. కొద్దిరోజుల కిందట జరిగిన మున్సిపల్ బడ్జెట్ సమావేశంలోనూ కమిషనర్ పోలీసులను ఉపయోగించి, వైఎస్సార్సీపీ సభ్యులను దగ్గరుండి మరీ బయటకు గెంటివేయించారు. సిబ్బంది సైతం ఆయన తీరుతో విసుగు చెందుతున్నట్లు వినిపిస్తోంది. కమిషనర్ మీద వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ఆ శాఖ ఆర్డీ విచారణకు ఆదేశించారు. తొలుత ఈ నెల 4వ తేదీన పార్వతీపురం మున్సిపల్ కార్యాలయంలో విచారణ ఉంటుందని చెప్పినా.. పండగ ఉందన్న కారణంతో కమిషనర్ తప్పించుకున్నట్లు తెలుస్తోంది. మరలా గురువారం విచారణ జరగనుంది. ఇదైనా సక్రమంగా జరుగుతుందా.. లేకుంటే రాజకీయరంగు పులుముకొని పక్కదారి పట్టిస్తారా? అన్న చర్చ మున్సిపల్ వర్గాల్లో సాగుతోంది.

ఎవరేమంటారో చూద్దాం!