సంఘటనా స్థలాన్ని పరిశీలించిన రైల్వే జీఎం | - | Sakshi
Sakshi News home page

సంఘటనా స్థలాన్ని పరిశీలించిన రైల్వే జీఎం

Apr 3 2025 2:46 PM | Updated on Apr 3 2025 2:46 PM

సంఘటనా స్థలాన్ని పరిశీలించిన రైల్వే జీఎం

సంఘటనా స్థలాన్ని పరిశీలించిన రైల్వే జీఎం

విజయనగరం టౌన్‌:

నాందేడ్‌ నుంచి సంబల్‌పూర్‌ వెళ్తున్న నాగావళి ఎక్స్‌ప్రెస్‌ విజయనగరం రైల్వేస్టేషన్‌ నుంచి బయలుదేరిన కొద్ది నిమిషాలకే పట్టాలు తప్పింది. చివరి రెండు బోగీలు పట్టాలు తప్పినట్టు గుర్తించిన గార్డు, డ్రైవర్‌ చాకచక్యంగా వ్యవహరించి వెంటనే రైలును నిలుపుదల చేశారు. దీంతో పెనుప్రమాదం తప్పింది. వందలాది మంది ఊపిరిపీల్చుకున్నారు. విజయజనగరం జిల్లా కేంద్రానికి సమీపంలోని సీఎంఆర్‌ కూడలి సమీపాన చోటుచేసుకున్న ఘటన వివరాలు ఇలా..

విజయనగరం రైల్వేస్టేషన్‌కు విశాఖ నుంచి రైలు నంబర్‌ 20810 సంబల్‌ పూర్‌ – నాందేడ్‌ వెళ్లే సంబల్‌ పూర్‌ నాగావళి ఎక్స్‌ప్రెస్‌ బుధవారం ఉదయం 11.50 గంటలకు విజయనగరం చేరుకుంది. 12.05 గంటలకు విజయనగరం నుంచి బయలుదేరింది. రైలు బయలుదేరే సమయం కావడంతో తక్కువ వేగంతోనే వెళ్తుంది. స్థానిక సీఎంఆర్‌ కూడలి వద్దకు వచ్చేసరికి రైలు చివరన ఉన్న జనరల్‌ బోగీ, గార్డ్‌ బోగీలు ప్రమాదంలో చిక్కుకున్నాయి. పట్టాలు తప్పాయి. అప్రమత్తమైన గార్డు డ్రైవర్‌కు వాకీటాకీలో సమాచారమివ్వడంతో డ్రైవర్‌ క్షణాల్లో రైలు నిలుపుదల చేశారు. పట్టాలు తప్పిన రెండు బోగీలలో జనరల్‌ బోగీ పట్టా నుంచి పక్కకు వచ్చి నిలబడిపోయింది. ముందు ఉన్న ఎక్స్‌ప్రెస్‌ బోగీలకు గానీ, వెనుక ఉన్న గార్డు బోగీకి ఎటువంటి ప్రమాదం జరగలేదు. పరిస్థితిని గమనించకపోయి ఉంటే మొత్తం బోగీలన్నీ ఒకదానిపై ఒకటి పేరుకుపోవడం, పక్కకు ఒరిగిపోవడం జరిగి ఉండేదని ఘటన చూసిన వారు చెబుతున్నారు. జనరల్‌ బోగీ పక్కకు రావడంతో అందులో ప్రయాణిస్తున్న సుమారు వందమందికిపైగా ప్రయాణికులు రైలు దిగిపోయి పరుగులు తీశారు. ఎవరికీ ఎటువంటి ప్రాణహాని జరగకపోవడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. సురక్షితంగా వారిని మిగతా బోగీల్లోకి ఎక్కించారు. అధికారులు అప్రమత్తమై సంఘటనా స్థలానికి చేరుకుని హుటాహుటిన రక్షణ చర్యలు చేపట్టారు. గార్డుబోగీ, జనరల్‌ బోగీలను అక్కడే వదిలేసి రైలును యథావిధిగా పంపించారు.

ప్రమాద స్థలాన్ని పరిశీలిస్తున్న ఆర్డీవో కీర్తి,

అధికారులు

బయలుదేరిన కొద్ది నిమిషాలకే పట్టాలు తప్పిన నాగావళి ఎక్స్‌ప్రెస్‌

అప్రమత్తమైన గార్డ్‌, డ్రైవర్‌

వెంటనే రైలు నిలుపుదల

పట్టాలు తప్పి ఎక్కడికక్కడ

నిలబడిపోయిన చివరి రెండు బోగీలు

హుటాహుటిన సహాయక చర్యలు చేపట్టిన అధికారులు

సంఘటనా స్థలాన్ని పరిశీలించిన రైల్వే డీఆర్‌ఎం, ఆర్డీఓ

నాగావళి ఎక్స్‌ప్రెస్‌ పట్టాలు తప్పిందన్న విషయాన్ని తెలుసుకున్న రైల్వే జీఎం పరమేశ్వరన్‌ ఫంక్వల్‌ భువనేశ్వర్‌ నుంచి ప్రత్యేక రైల్లో విజయనగరానికి బుధవారం సాయంత్రం చేరుకున్నారు. డీఆర్‌ఎం లలిత్‌ బోరాతో కలిసి పరిస్థితిని సమీక్షించారు. ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. పూర్తిస్ధాయి నివేదికపై అధికారులతో సమీక్ష చేయనున్నారు. విజయనగరం ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతిరాజు, ఆర్డీఓ దాట్ల కీర్తి, వన్‌టౌన్‌ సీఐ ఎస్‌.శ్రీనివాస్‌ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement