మే నెలలో సప్లిమెంటరీ పరీక్షలు
● సీనియర్ ఇంటర్లో 77 శాతం,
జూనియర్లో 73 శాతం ఉత్తీర్ణత
● ప్రభుత్వ యాజమాన్య
కళాశాలల్లో పరిస్థితి మెరుగు
నరసరావుపేట ఈస్ట్: ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలలో పల్నాడు జిల్లా రాష్ట్రంలో 14వ స్థానంలో నిలిచింది. గత ఏడాది సీనియర్ ఇంటర్లో 12, జూనియర్ ఇంటర్లో 13వ స్థానాలలో నిలిచిన పల్నాడు జిల్లా ఈ ఏడాది సీనియర్ ఇంటర్లో 14, జూనియర్ ఇంటర్లో 13వ స్థానంలో నిలిచింది. సీనియర్ ఇంటర్మీడియట్లో 14,381 మంది విద్యార్థులకుగాను 11,114 మంది, జూనియర్ ఇంటర్లో 15,945 మందికిగాను 11,162 మంది ఉత్తీర్ణులయ్యారు.
వివిధ విద్యాసంస్థల్లో ఇలా...
● ప్రభుత్వ యాజమాన్య కళాశాలల్లో జిల్లా వ్యాప్తంగా సీనియర్ ఇంటర్లో కేజీబీవీ విద్యాలయాల్లో 87.29 శాతం, ఏపీఆర్జేసీ 93.33, ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 60, ఎయిడెడ్ కళాశాలలు 34, సోషల్ వెల్ఫేర్ కళాశాలల్లో 90.28, హైస్కూల్స్ 63.75, ఏపీ మోడల్ స్కూల్స్ 82 శాతం ఉత్తీర్ణత సాధించాయి.
● జూనియర్ ఇంటర్మీడియట్లో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 54.48, ఏపీఆర్జేసీ 76.56, ఎయిడెడ్ 16, సోషల్ వెల్ఫేర్ 74.46, హై స్కూల్స్ 41, కేజీబీవీ 82, ఏపీ మోడల్ స్కూల్స్ 79.34 శాతం ఉత్తీర్ణత సాధించాయి.
● కాగా సీనియర్ ఇంటర్ ఎంపీసీలో గురజాల ప్రభుత్వ కళాశాల విద్యార్థి ఎన్. లీలా వినయ్ 983, బైపీసీలో పిడుగురాళ్ల ప్రభుత్వ కళాశాల విద్యార్థిని ఎం.సుస్మిత జాస్మిన్ 973 మార్కులతో టాపర్లుగా నిలిచారు.
ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు మే 21 నుంచి జూన్ 4వ తేదీ వరకు నిర్వహించనున్నట్టు జిల్లా ఇంటర్మీడియట్ అధికారి నీలావతిదేవి తెలిపారు. ఈ నెల 20 నుంచి 27వ తేదీ వరకు ఫీజు చెల్లించాలని పేర్కొన్నారు. ఇదే సమయంలో విద్యార్థులు రీకౌంటింగ్, రీవాల్యుయేషన్కు దరఖాస్తు చేసుకోవచ్చని వివరించారు. ప్రాక్టికల్ పరీక్షలు జూన్ 7 నుంచి 11వ తేదీ వరకు నిర్వహిస్తారన్నారు. అలాగే జూనియర్ ఇంటర్ హ్యూమన్ వాల్యూస్ జూన్ 5వ తేదీన, పర్యావరణం పరీక్షను జూన్ 6వ తేదీన నిర్వహిస్తారని తెలిపారు. సప్లిమెంటరీ పరీక్షలు జూనియర్ ఇంటర్కు ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, సీనియర్ ఇంటర్కు మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 గంటల వరకు జరుగుతాయని పేర్కొన్నారు.


