ఎమ్మెల్యే వర్గం, వ్యతిరేక వర్గం పరస్పరం ఆరోపణలు
తాడికొండ: బండారుపల్లి గ్రామంలో మంగళవారం నిర్వహించిన గ్రామ సభ గందరగోళంగా మారింది. తెలుగుదేశం పార్టీలోని ఇరువర్గాలు గ్రామసభ సాక్షిగా బాహాబాహీకి దిగడంతో సభలో అధికారులు ప్రేక్షక పాత్ర వహించడమే అయింది. ఎమ్మెల్యే అనుకూల వర్గానికి చెందిన గ్రామపార్టీ అధ్యక్షులు ఇతరులు స్టేజీపై కూర్చొని నడిపిస్తుండటం, తాత్కాలికంగా నియమించిన పంచాయతీ ఉద్యోగుల విషయంపై వ్యతిరేక వర్గం నిలదీయడంతో రసాభాసగా మారింది. గ్రామంలో తాగునీటి సరఫరాలో నాణ్యత ఉండటం లేదని, ఇటీవల రూ.10 లక్షలతో మరమ్మతులు తూతూ మంత్రంగా చేసి పాత ఇటుకలనే పేర్చడంతో ఫిల్టర్ అవడం లేదని ఆరోపించారు. వివాదం ముదరడంతో అధికారులు నామమాత్రంగా సభను నిర్వహించి చేతులెత్తేశారు.


