సత్తెనపల్లి: సత్తెనపల్లికి చెందిన వర్ధమాన పౌరాణిక రంగస్థల కళాకారుడు బెజగం రవికుమార్కి రెండు తెలుగు రాష్ట్రాల్లో వివిధ విభిన్న, వైవిధ్యమైన పౌరాణిక పాత్రలను, ఏకపాత్రాభినయ నాటిక రూపంలో ప్రదర్శనలు చేసినందుకుగాను కళాజ్యోతి, స్టార్ గోల్డెన్ పురస్కారాలను ప్రదానం చేశారు. ఒంగోలు సమీపంలోని కారవాది గ్రామంలో వివేకానంద విద్యానిలయ ప్రాంగణంలో ఎల్సీఈఎస్ ఫౌండేషన్ ఆధ్యాత్మిక సేవా సంస్థ వారిచే వివిధ రంగాల్లో ప్రావీణ్యం పొందిన కళాకారులు, సమాజసేవకులు, లఘు చిత్ర నిర్మాతలకు సోమవారం పురస్కారాలు ప్రదానం చేశారు. ఇందులో భాగంగా రవికుమార్కు ఎల్సీఈఎఫ్ నేషనల్ ఫౌండేషన్ జాతీయ ఆధ్యాత్మిక సాంస్కృతిక కళా సేవా సంస్థ ఒంగోలు వారి కళాజ్యోతి, లిటిల్ చాంప్స్ వారి జాతీయగోల్డెన్ అవార్డు అందజేసి సత్కరించారు. ఈ సందర్భంగా రవికుమార్ పౌరాణిక పాత్రధారణలో రెండు రాష్ట్రాల స్థాయిలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారని వక్తలు కొనియాడారు. రెండు పురస్కారాలు అందుకున్న బెజగం రవికుమార్ను పట్టణంలోని వివిధ కళా సంస్థలు, మిత్రులు సోమవారం అభినందించారు.


