వైఎస్సార్సీపీ జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని వన్టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు
నరసరావుపేట: ఏబీఎన్ రాధాకృష్ణ వ్యాఖ్యలు సమాజానికి తలవంపులు అని వైఎస్సార్సీపీ జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తెలిపారు. అతనిపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని పేర్కొన్నారు. పార్టీ నాయకుల భార్యలపై చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ గురువారం డాక్టర్ గోపిరెడ్డి ఆధ్వర్యంలో పార్టీ జిల్లా, నియోజకవర్గ అనుబంధ, పట్టణ, మండల అధ్యక్షులు, జెడ్పీటీసీ సభ్యులు అందరూ కలిసి స్థానిక వన్టౌన్ పోలీస్స్టేషన్లో ఏబీఎన్ రాధాకృష్ణపై ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ గోపిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రాధాకృష్ణ ఇటువంటి మాటలు మాట్లాడటం ద్వారా బూతు కిట్టుగా మరోసారి నిరూపించుకున్నారని పేర్కొన్నారు. చంద్రబాబుకు పల్లకి మోయాలనుకుంటే మోసుకోవటం అతని ఇష్టమని, అంతేగానీ మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం ఎంతమాత్రం క్షమార్హం కాదన్నారు. రాష్ట్రంలో కొన్ని పత్రికలు రాజకీయ పార్టీలకు అనుకూలంగా రాస్తున్నాయని, అది వారిష్టంగా రాసుకోవచ్చునని అన్నారు. ఇలాంటి దుర్మార్గమైన భాష మాట్లాడటం సమంజసం కాదని, బూతు వ్యాఖ్యలు చేయడం ఎంత మాత్రం సమర్థనీయం కాదని అన్నారు. సైకిల్ మీద కిరోసిన్ విక్రయించి బతికిన రాధాకృష్ట, ఒక చిరుద్యోగిగా పత్రికలో చేరి ఈ రోజు ఆ పత్రిక యజమానిగా ఎలా అయ్యారో అందరికీ తెలుసునని అన్నారు. అతని వెనుక చంద్రబాబు నాయుడు, చంద్రబాబు వెనుక అతను ఉన్నారనే విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసునని చెప్పారు. అయితే మహిళలను గౌరవించాల్సిన నైతిక బాధ్యత ఈ కూటమి ప్రభుత్వంలో కనిపించట్లేదన్నారు. అరవ శ్రీధర్ అనే ఎమ్మెల్యే ఒక మహిళపై అత్యాచారం చేశాడని, షాపింగ్ కోసం బయటకు వస్తే బహిరంగంగా రోడ్డు మీద దాడి చేశారన్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో మహిళలకు ఏమాత్రం రక్షణ లేదని అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో 60 ఏళ్ల వృద్ధుడు ఓ అమ్మాయిని బలాత్కారం చేశాడని, ఒక మహిళ హోంశాఖ మంత్రిగా ఉన్న ఈ రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైందన్నారు. సీనియర్ నాయకులు షేక్ ఖాజావలి మాస్టారు, ఇంటలెక్చ్యువల్ ఫోరం రాష్ట్ర కార్యదర్శి ఇయం.స్వామి, గురజాల నియోజకవర్గ పరిశీలకులు పడాల శివారెడ్డి, జెడ్పీటీసీ సభ్యులు పదముత్తం చిట్టిబాబు, ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి కందుల ఎజ్రా, రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు గంటెనపాటి గాబ్రియేలు, ఎన్కే ఆంజనేయులు, లీగల్ సెల్, బీసీ సెల్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు రోళ్ల మాధవి, సిద్ధారపు గాంధీ, కొమ్ము చంద్రశేఖర్, జిల్లా కార్యదర్శి ఎస్.సుజాతాపాల్, బీసీ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు సుబ్రహ్మణ్యం నాయీ, జిల్లా సంయుక్త కార్యదర్శి యన్నం రాధాకృష్ణారెడ్డి, పట్టణ అధ్యక్షులు షేక్ కరిముల్లా, వర్కింగ్ అధ్యక్షులు అచ్చిశివకోటి, లీగల్ సెల్ నియోజకవర్గ అధ్యక్షులు వై.సీతారామిరెడ్డి, పట్టణ ఎస్సీ సెల్ కార్యదర్శి కుక్కల పౌలయ్య, నాయకులు పాల్గొన్నారు.


