సోషల్ మీడియాలో ఇద్దరికి పరిచయం ఆ చనువుతో ఇంటికి పిలిచిన బాఽధితురాలు అదే అదనుగా అత్యాచారం చేసిన నిందితుడు భయంతో పోలీసులను తప్పుదోవ పట్టించిన మహిళ
సాక్షి, నరసరావుపేట: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మాచర్ల ప్రభుత్వ ఉద్యోగినిపై లైంగిక దాడి కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడికి సోషల్మీడియా ద్వారా ఆ మహిళతో ఉన్న పరిచయంతో ఇంటికి వెళ్లి అత్యాచారం చేసినట్టు పోలీసులు గుర్తించారు. బాధితురాలు భయంతో పోలీసులను తప్పుదోవ పట్టించారని, సాంకేతిక ఆధారాలు, సీసీ టీవీ ఫుటేజ్ ద్వారా నిందితుడు పరిచయస్తుడే అని తేలినట్లు పోలీసులు తెలిపారు. నరసరావుపేట ఎస్పీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పల్నాడు జిల్లా ఎస్పీ బి కృష్ణారావు కేసు వివరాలను వెల్లడించిన వివరాల ప్రకారం... మాచర్ల పట్టణంలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగిని (32) ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ నెల 2వ తేదీన మధ్యాహ్నం గుర్తు తెలియని వ్యక్తి మంచినీటి కోసం వచ్చినట్లు చెప్పి ఇంటిలోకి ప్రవేశించాడని పేర్కొన్నట్లు తెలిపారు. కత్తితో బెదిరించి లైంగికదాడి చేయబోతే తనకు హెచ్ఐవీ ఉందని చెప్పడంతో నిందితుడు ఆగ్రహంతో దాడి చేసి పారిపోయాడని పేర్కొన్నట్లు చెప్పారు. ఎదురింటివారి సమాచారంతో అక్కడికి చేరుకున్న అంబులెన్స్ సిబ్బంది ఆమెను ఆసుపత్రికి చేర్చారన్నారు. బాఽధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి అదనపు ఎస్పీ జేవీ సంతోష్ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేశామన్నారు. విచారణలో పల్నాడు జిల్లా రాజుపాలెం గ్రామానికి చెందిన నామాల శ్రీనివాస్ (27)ను నిందితుడిగా గుర్తించి అరెస్ట్ చేశామని పల్నాడు జిల్లా ఎస్పీ వివరించారు.
సోషల్ మీడియాలో పరిచయం...
అత్యాచారం తరువాత బాధితురాలు చెబుతున్న వివరాల ద్వారా పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారించిన పోలీసులకు వారి పాత్ర లేదని తెలుసుకున్నామని ఎస్పీ తెలిపారు. బాధిత మహిళ సెల్ఫోన్, సోషల్మీడియా ఖాతాలు, సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా కేసు విచారణ చేపట్టగా నిందితుడిని గుర్తించామన్నారు. రాజుపాలెం గ్రామానికి చెందిన నామాల శ్రీనివాస్(27) సోషల్ మీడియా ద్వారా పరిచయం చేసుకొని ఈ ఘాతుకానికి పాల్పడినట్టు తెలిపారు. ఈ ఏడాది మార్చి 11వ తేదీన మరింత సాన్నిహిత్యం పెరిగిందని, తరువాత బాధితురాలు మాచర్లలోని తన ఇంటికి రమ్మని ఆహ్వానించిందని ఎస్పీ పేర్కొన్నా. ఇంటికి వచ్చిన శ్రీనివాస్ ఆమైపె లైంగిక దాడి చేశాడన్నారు. నిందితుడు విచక్షణ మరిచి ప్రవర్తించడంతో బాధిత మహిళ తీవ్రంగా ప్రతిఘటించడంతో ఆమె కాళ్లు చేతులూ కట్టేసి పారిపోయాడన్నారు. పరిచయస్తుడే కావడంతో బాధితురాలు భయపడి పూర్తి వివరాలను వెల్లడించకుండా పోలీసులను తప్పుదోవ పట్టించిందన్నారు. నిందితుడిని మాచర్ల రైల్వేస్టేషన్లో అరెస్ట్ చేసి స్థానిక అడిషనల్ జ్యూడీషియల్ ఫస్ట్క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో ప్రవేశపెట్టడంలో 14 రోజుల రిమాండ్ విధించారన్నారు. నిందితుడిని పోలీసులు గురజాల సబ్ జైలుకు తరలించారని పేర్కొన్నారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేయడానికి బాధితురాలు, నిందితుడి ఫోన్లను స్వాధీనం చేసుకొని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపామన్నారు. బాధితురాలి మెడికల్ రిపోర్టుపై వైద్యుల అభిప్రాయం కోసం ఎదురుచూస్తున్నామని పేర్కొన్నారు. ఈ రిపోర్టుల ఆధారంగా దర్యాప్తు కొనసాగుతుందని జిల్లా ఎస్పీ స్పష్టం చేశారు. సృష్టమైన ఆధారాలు లేకపోయినా, బాధితురాలు తప్పుదోవ పట్టించినా కేసులో పురోగతి సాధించిన అదనపు ఎస్పీ జేవీ సంతోష్, ఆయన బృందాన్ని ఎస్పీ అభినందించారు.


