జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా
అమరావతి: గ్రామస్థాయిలో ప్రజలకు మెరుగైన వైద్యసేవలను అందించటానికి ప్రభుత్వం స్వర్ణ గ్రామ ఆరోగ్యదర్శిని కార్యక్రమం ద్వారా గ్రామాల్లో ప్రత్యేక వైద్యసేవా కార్యక్రమాలను నిర్వహిస్తుందని పల్నాడు జిల్లా కలెక్టర్ కృత్తికా శుక్లా అన్నారు. గురువారం స్థానిక త్రిశక్తిపీఠం ఆడిటోరియంలో ప్రతి నెలా మొదటి గురువారం నిర్వహించే ఆరోగ్య అవగాహన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. అంగన్వాడీలు, ఏఎన్ఎంలు, ఆశావర్కర్లు గ్రామాల్లో ప్రజారోగ్యం, పోషకాహారం, వ్యక్తిగత పరిశుభ్రతపై గ్రామాల్లో అవగాహన కల్పించాలన్నారు. స్వర్ణగ్రామ ఆరోగ్యదర్శిని ద్వారా గ్రామీణ ప్రాంత ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన పెంపొందించడంమే కాకుండా సామాజిక భాగస్వా మ్యంతో ఆరోగ్య నిర్వహణను మెరుగుపరచడానికి కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమం ద్వారా గ్రామీణ ప్రజలకు, ముఖ్యంగా రైతులకు, తక్కువ ఆదాయ వర్గాల వారికి, వైద్య సేవలు మరింత చేరువ చేయాలన్నారు. అలాగే పౌష్టికాహారం పంపిణీ, రక్తహీనత తగ్గించటానికి తీసుకుంటున్న చర్యలను అంగన్ వాడీలను అడిగి తెలుసుకున్నారు. అలాగే వివిధ రకాల టీకాలను అందించటంపై సమీక్ష నిర్వహించి సంబందిత అధికారులు, సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. పల్నాడు జిల్లా డీఎంహెచ్ఓ డాక్టర్ రవి, డీడీవో రాజగోపాల్, తహసీల్దార్ డానియేల్, ఎంపీడీవో పార్వతితదితర అధికారులతో పాటుగా అంగన్వాడీలు, ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు, గ్రామపంచాయతీల సిబ్బంది పాల్గొన్నారు.
క్రోసూరు: విద్యాశాఖ ప్రభుత్వ పాఠశాలల బాలికలకు అందిస్తున్న ప్రతిష్టాత్మక నీట్, జేఈఈ, ఈప్సెట్ రెసిడిన్షియల్ ఉచిత కోచింగ్ను సద్వినియోగం చేసుకోవాలని ఏపీ మోడల్ స్కూల్స్ జాయింట్ డైరెక్టర్ తెహరా సుల్తానా తెలిపారు. గురువారం క్రోసూరులోని ఏపీ మోడల్ స్కూల్లో నిర్వహిస్తున్న నీట్, జేఈఈ, ఈప్ సెట్ రెసిడెన్షియల్ కోచింగ్ కేంద్రాన్ని ఆమె పరిశీలించారు. జేడీ మాట్లాడుతూ బాలికలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ఉన్నత లక్ష్యాలు సాధించాలని కోరారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల బాలికలు జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో ప్రతిభ కనబరచాలన్నారు. కోచింగ్ నిర్వహణ, బోధనా ప్రమాణాలు ఏవిధంగా ఉన్నాయని విద్యార్థినులను అడిగి తెలుసుకున్నారు. ఏఎంఓ కె.సుజనా, ఏఏఏఓ ఎస్.నాగేంద్రకుమార్, ప్రిన్సిపాల్ మేరీసూజన్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


