తన మూడేళ్ల పెద్దకుమార్తెను చున్నీతో కట్టుకుని సాగర్ కాల్వలో దూకిన తల్లి
ఇద్దరి మృతదేహాలు వెలికితీత
రెండు నెలల క్రితం చిన్నకుమార్తె మృతిచెందడంతో మానసికంగా కుంగిపోయిన వైనం
విజయపురిసౌత్: చిన్న కూతురు అనారోగ్యంతో మృతి చెందిదన్న బాధతో పెద్ద కూతురితో కలిసి నాగార్జునసాగర్ కుడి కాలువలోకి తల్లి ఆత్మహత్య చేసుకున్న సంఘటన బుధవారం చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. మాచర్ల పట్టణంలోని ఒకటో వార్డుకు చెందిన ఆరె అమరేశ్వరి(23), వెంకటశివ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, రెండు నెలల క్రితం చిన్న కుమార్తె యశ్విక (ఒకటిన్నర సంవత్సరాలు) అనారోగ్యంతో మృతి చెందగా అప్పటినుంచి తల్లి అమరేశ్వరి మనస్తాపంతో కుంగిపోయింది. ఇది గమనించిన భర్త అమరేశ్వరి వెన్నంటే ఉంటూ వస్తున్నాడు. బుధవారం వెంకటశివ పని నిమిత్తం దుర్గి వెళ్లాడు. చిన్న కుమార్తె చనిపోయిందన్న బాధతో ఉన్న అమరేశ్వరి పెద్ద కుమార్తె లతికశ్రీ(3)తో కలిసి తాళ్లపల్లి సమీపంలోని సాగర్ కుడి కాలువలో వద్దకు వెళ్లింది. అనంతరం తన చున్నీతో లతికశ్రీ ముడి వేసుకొని నీటి ప్రవాహంలోకి దూకింది. సమాచారం అందుకున్న విజయపురిసౌత్ ఎస్ఐ అశోక్ సిబ్బందితో కాలువలో గాలించారు. అనంతరం తల్లీకూతుర్ల మృతదేహాలు వెలికి తీశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ అశోక్ పేర్కొన్నారు.


