మంగళగిరి టౌన్: రాష్ట్రంలోని చేతివృత్తిదారుల సమస్యలు, అభివృద్ధి అవకాశాలపై చర్చించేందుకు మంగళగిరిలో ఈనెల 18, 19 తేదీల్లో రాష్ట్రస్ధాయి వర్క్షాప్ నిర్వహించనున్నట్లు సీపీఐ జాతీయ సమితి సభ్యులు ముప్పాళ్ల నాగేశ్వరరావు తెలిపారు. మంగళగిరి పట్టణంలోని సీపీఐ కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ముప్పాళ్ల మాట్లాడుతూ చేతి వృత్తిదారుల నైపుణ్య అభివృద్ధి, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, ఉత్పత్తుల మార్కెటింగ్ అవకాశాల విస్తరణ, ఉపాధి భద్రత వంటి కీలక అంశాలపై పలువురు నిపుణులతోపాటు వృత్తిదారులు చర్చించనున్నారని పేర్కొన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ఆంధ్రప్రదేశ్ చేతివృత్తిదారుల సమైక్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామాంజనేయులు, రాష్ట్ర చేనేత కార్మిక సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి గొట్టిముక్కల బాలాజీ, సీపీఐ నాయకులు కంచర్ల కాశయ్య, యార్లగడ్డ వెంకటేశ్వరరావు, జాలాది జాన్బాబు, ఏఐటీయూసీ నియోజకవర్గ కార్యదర్శి చిన్ని సత్యనారాయణ, ఏపీ మత్స్య కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.


