
కుమారుడి ఆచూకీ లేదయ్యా..!
పదిరోజులుగా
● ప్రేమించిన అమ్మాయి పిలిస్తే వెళ్లాడు.. అనంతరం కనిపించడం లేదు ● యువతి తల్లిదండ్రులపై అనుమానం ● జిల్లా ఎస్పీకి యువకుడి తల్లి ఫిర్యాదు ● పోలీసు పీజీఆర్ఎస్లో ఫిర్యాదులు స్వీకరించిన ఎస్పీ కంచి శ్రీనివాసరావు
నరసరావుపేట రూరల్: ప్రేమించిన అమ్మాయి పిలిస్తే వెళ్లిన తన కొడుకు తిరిగి రాలేదని, పది రోజులైన ఆచూకీ లేకపోవడంతో పోలీసులను ఆశ్రయించినా పట్టించుకోవడంలేదని నాదెండ్ల మండలం గురిజవోలుకు చెందిన పల్లపు కోటేశ్వరమ్మ జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావుకు ఫిర్యాదు చేసింది. గ్రామానికి చెందిన యువతిని తన కుమారుడు విజయకుమార్ ప్రేమిస్తున్నాడని, ఇది ఇష్టంలేని యువతి తల్లిదండ్రులు ఆమెను నరసరావుపేట మండలం దొండపాడులో ఉంచారని తెలిపింది. యువతి దొండపాడు రమ్మని చెప్పడంతో వెళ్లిన విజయకుమార్ వెళ్లాడని తిరిగి రాలేదని వాపోయింది. సెల్ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుండడంతో ఏదైనా అఘాయిత్యం చేసి ఉంటారనే ఆందోళనను ఆమె వ్యక్తం చేసింది. జిల్లా ఎస్పీ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం సోమవారం నిర్వహించారు. జిల్లా ఎస్పీ కె.శ్రీనివాసరావు కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఆర్థిక, కుటుంబ వివాదాలు వంటి 100 ఫిర్యాదులు అందాయి.
బ్యాంకుకు నగదు చెల్లించకుండా మోసం
తమ వద్ద వసూలు చేసిన లోన్ నగదును బ్యాంక్కు కట్టకుండా యానిమేటర్ మస్తాన్వలి మోసం చేసినట్టు రాజుపాలెం మండలం ఇనుమెట్ల గ్రామానికి చెందిన నాగమ్మ మహిళా గ్రూపు మహిళలు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. రాజుపాలెం యూనియన్ బ్యాంక్లో రూ.10లక్షలు తీసుకోగా బ్యాంక్ అకౌంట్ను యానిమేటర్ నకరికల్లుకు మార్చారని తెలిపారు. తరువాత లోన్ నగదును బ్యాంక్కు చెల్లిస్తానని ప్రతి నెల యానిమేటర్ తీసుకొన్నాడని వివరించారు. లోన్ నగదు చెల్లింపు పూర్తయిందని తమతో చెప్పారని, ఇప్పుడు రాజుపాలెం బ్యాంక్ నుంచి రూ.5.50లక్షలు చెల్లించాలని నోటీసులు వచ్చాయని వాపోయారు.
నకిలీ ఇళ్ల పట్టాలు ఇచ్చారు..
ఇళ్ల పట్టాలు ఇస్తామని చెప్పి నగదు తీసుకొని జిల్లా సర్వేయర్ పేరుతో నకిలీ సంతకాలతో షేక్ జిలాని, మహబూబ్ సుభానిలు మోసం చేసినట్టు రాజుపాలెం మండలం అనుపాలెం గ్రామానికి చెందిన బత్తుల నాగేశ్వరరావు ఫిర్యాదు చేసాడు. డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగితే భయబ్రాంతులకు గురిచేస్తున్నాడని తెలిపారు.