
హౌసింగ్ కాలనీలపై సత్వరం నివేదిక ఇవ్వండి
అధికారులకు జిల్లా కలెక్టర్ ఆదేశం
నరసరావుపేట: హౌసింగ్ కాలనీల అభివృద్ధిపై త్వరితగతిన నివేదిక ఇవ్వాలని జిల్లా కలెక్టర్ పి.అరుణ్బాబు ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఇదివరకు చేపట్టిన హౌసింగ్ కాలనీ అభివృద్ధి పనులుకు సంబంధించి పురోగతి ధ్రువీకరణపై సమీక్ష చేశారు. పనుల తనిఖీ నిమిత్తం జిల్లాలో మొత్తం 18టీమ్లను ఏర్పాటు చేయగా, మొత్తం 741 పనులకు ఇప్పటివరకు 277 పనులు మాత్రమే తనిఖీ పూర్తిచేసి ఉన్నారని, మిగిలిన 464 పనులు తనిఖీ వారంలోగా పూర్తి చేయాలని సూచించారు. తనిఖీలు పూర్తి పారదర్శకంగా నిర్వహించాలని, పూర్తిచేసిన అన్ని పనులకు ఒక వారంలోపు నివేదికను డ్వామా ప్రాజెక్ట్ డైరెక్టర్కు సమర్పించాలని ఆదేశించారు. జూనియర్ క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్ జె.ప్రభాకర్, తనిఖీ బృంద సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు.
‘ఫలక్నుమా’లో
ఆరుగురు బాల కార్మికులు గుర్తింపు
రాజుపాలెం: నడికూడి గవర్నమెంట్ రైల్వే పోలీసు, గుంటూరు ఆర్పీఎఫ్, బచపన్ బచావో ఆందోళన్ స్వచ్ఛంద సంస్థలు సంయుక్తంగా హౌరా నుంచి సికింద్రాబాద్ వెళ్లే ఫలక్నుమా ఎక్స్ప్రెస్లో గుంటూరు నుంచి పిడుగురాళ్ల వరకు ట్రైన్లో రిస్క్ ఆపరేషన్ నిర్వహించగా.. ఇతర రాష్ట్రాలకు చెందిన ఆరుగురు బాలురను గుర్తించి వారి వివరాలను సేకరించారు. వీరిని ఇతర ప్రాంతాలకు బాల కార్మికులుగా పనిచేయించేందుకు తీసుకెళుతున్నట్లు తెలిసింది. వారివారి గ్రామాలకు పంపించే వరకు మండలంలోని కొండమోడు పరిధిలో గల వీరమ్మ కాలనీలోని అనాధ పిల్లల ఆశ్రమం నిర్వాహకులు గరికపాటి శంకరరావుకు ఆదివారం రాత్రి స్థానిక ఎస్ఐ వేణుగోపాల్ సహకారంతో అప్పగించారు. ఈ బాలురు జార్ఖండ్, బిహార్, వెస్ట్ బెంగాల్కు చెందిన వారిగా గుర్తించారు. వారి తల్లిదండ్రులకు అప్పగించే వారకు జాగ్రత్తగా చూసుకోవాలని ఆశ్రమ నిర్వాహకులకు సూచించారు.