
‘రెడ్ బుక్’ పోలీసింగ్
సాక్షి, నరసరావుపేట: పల్నాడు జిల్లాలో పోలీసు శాఖ రెడ్ బుక్ పోలీసింగ్ వ్యవస్థను అమలు చేస్తోంది. రాజ్యాంగం ప్రకారం పౌరులకు ఉండాల్సిన హక్కులను కాలరాసి అక్రమ కేసులు, నిర్భంధాలతో ప్రతిపక్షాల గొంతును నొక్కుతోంది. ముఖ్యంగా వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు టార్గెట్గా పల్నాడు పోలీసులు వేధింపులకు పాల్పడుతున్నారు. మహిళలను సైతం వడదలకుండా అధికార పార్టీ నేతల ఆదేశాలతో దురుసుగా ప్రవర్తిస్తున్నారు. వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులు, సానుభూతిపరులపై అక్రమ కేసులు నమోదు చేస్తున్నారు. మరికొందరినైతే ఏ కేసు లేకపోయినా రోజుల తరబడి పోలీసు స్టేషన్కు పిలిపించి కూర్చోబెడుతున్నారు. గట్టిగా అడిగితే స్థానిక ఎమ్మెల్యే నుంచి ఒత్తిడి ఉంది, తప్పనిసరి పరిస్థితుల్లో చేస్తున్నామంటూ తప్పించుకొనే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా శనివారం మాజీ మంత్రి విడదల రజిని అనుచరుడు మానుకొండ శ్రీకాంత్రెడ్డి అరెస్ట్ సైతం అదే కోవ జరిగింది. నిరాధార ఆరోపణలతో టీడీపీకి అనుకూలంగా మారిన వ్యక్తి ఇచ్చిన తప్పుడు ఫిర్యాదు ఆధారంగా అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించారు. ఎందుకు తీసుకెళ్తున్నారు, ఎక్కడికి తీసుకెళ్తున్నారని విడదల రజిని చిలకలూరిపేట రూరల్ సీఐను ప్రశ్నిస్తే సమాధానం ఇవ్వలేదు. ‘నీకెందుకు చెప్పాలి’ అంటూ మాజీ మంత్రి, బీసీ మహిళా నేత అనే స్పృహ కూడా లేకుండా అమర్యాదగా వ్యవహరించాడు. ‘ఎక్కువ మాట్లాడితే నీపై కేసు పెట్టాల్సి ఉంటుందంటూ’ బెదిరింపు ధోరణికి దిగాడు. ఈ వ్యవహారం చూస్తుంటే కూటమి ప్రభుత్వంలో రాష్ట్రంలో ఓ మహిళా మాజీ మంత్రికి సైతం రక్షణ లేదని, సాధారణ మహిళల పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించుకోవచ్చన్న చర్చ జరుగుతోంది.
రోజంతా కారులో తిప్పుతూనే...
శ్రీకాంత్రెడ్డిని చిలకలూరిపేట రూరల్ పోలీసులు శనివారం మధ్యాహ్నం అరెస్ట్ చేసిన తరువాత ఉదయం సమయంతో ఎఫ్ఐఆర్ కట్టినట్టు తెలుస్తోంది. అప్పటికే కేసు నమోదై ఉంటే విడదల రజిని ‘ఏ కేసులో అరెస్ట్ చేస్తున్నారో’ చెప్పమన్నప్పుడు ఎఫ్ఐఆర్ కాపీ చూపేవారన్న వాదన వినిపిస్తోంది. శనివారం మధ్యాహ్నం శ్రీకాంత్రెడ్డిని అరెస్ట్ చేసినప్పటి నుంచి వాహనంలో రోజంతా తిప్పినట్టు తెలుస్తోంది. ఈ కేసుకు వర్తించే సెక్షన్ల ప్రకారం స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపే అవకాశం ఉన్నప్పటికీ కావాలనే రిమాండ్ రిపోర్టులో తీవ్రతను పెంచి రిమాండ్కు పంపే కుట్ర పన్నినట్టు శ్రీకాంత్ రెడ్డి తరఫు న్యాయవాదులు తెలిపారు. ఇప్పటికే శ్రీకాంత్రెడ్డిపై చిలకలూరిపేట, నరసరావుపేట నియోజకవర్గాల పరిధిలో పలు కేసులు నమోదు చేశారు. ఎలాగైనా బీసీ మహిళా నేత విడదల రజినిని ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశంతో అధికార పార్టీ నేతలు, పోలీసులు కలిసి ఆమె వర్గంపై కేసులు పరంపర కొనసాగిస్తున్నారు. 65 ఏళ్ల పైబడిన ఆమె మామ విడదల లక్ష్మీనారాయణ, మరిది విడదల గోపి, పీఏలు రామకృష్ణ, ఫణి, సోషల్మీడియా యాక్టివిస్టులు రాకేష్ గాంధీ, రెడ్డిగారి అమ్మాయి సుధారాణి, పాలేటి కృష్టవేణి.. ఇలా అందర్ని అక్రమ కేసులతో ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. మరోవైపు విడదల రజినిపై సైతం అక్రమ కేసులు నమోదు చేస్తున్నారు.
ప్రతిపక్ష నేతలు, కార్యకర్తలను అక్రమ కేసులతో వేధిస్తున్న పల్నాడు పోలీసులు తప్పుడు ఫిర్యాదులతో జైలుపాలుచేసే కుట్ర అడిగితే ఎమ్మెల్యేల ఒత్తిడితో తప్పడం లేదని తప్పించుకునే ప్రయత్నం విడదల రజిని అనుచరుడు శ్రీకాంత్ విషయంలోనూ అదే తీరు మాజీ మంత్రి అనే స్పృహ లేకుండారజినీతో సీఐ దురుసు ప్రవర్తన సీఐ సుబ్బనాయుడు తీరును ఖండిస్తున్న ప్రతిపక్షాలు, మహిళలు
సీఐ తీరుపై మండిపాటు...
మాజీ మంత్రి విడదల రజినిపై చిలకలూరిపేట సీఐ సుబ్బనాయుడు ప్రవర్తించిన తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బీసీ మహిళ అనే స్పృహ లేకుండా సీఐ దురుసుగా ప్రవర్తించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. పోలీసులను అడ్డుపెట్టుకొని కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలకు ఇప్పటికై నా ముగింపు పలకాలని, లేకపోతే ప్రజలలో వ్యతిరేకత మరింత పెరిగి రోడ్లపైకి వచ్చే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. సీఐ తీరుపై రాష్ట్రవ్యాప్తంగా మహిళలు రోడ్లపై నిరసన ప్రదర్శనలు చేసి ఖండించారు. ప్రభుత్వం ఆ సీఐపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే రానున్న వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో సీఐపై చట్టపరమైన చర్యలు తీసుకునేలా చూస్తామని నాయకులు హెచ్చరికలు జారీ చేశారు.