
నరసరావుపేట రైల్వే స్టేషన్లో విస్తృత తనిఖీలు
నరసరావుపేటటౌన్: కశ్మీర్లోని పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో నరసరావుపేట ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు అప్రమత్తమయ్యారు. గురువారం రైల్వేస్టేషన్, పరిసరాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. స్టేషన్ పరిసరాల్లో ప్రయాణికులను క్షుణ్ణంగా తనిఖీచేశారు. శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమరావతికి రానున్న నేపథ్యంలో పటిష్టవంతమైన భద్రతా చర్యల్లో భాగంగా తనిఖీలు నిర్వహిస్తున్నట్లు జీఆర్పీ ఎస్ఐ వి.శ్రీనివాసరావు నాయ క్ తెలిపారు. తనిఖీల్లో నరసరావుపేట జీఆర్పీ, ఆర్పీఎఫ్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
గిరిజన పాఠశాలలో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానం
వినుకొండ: స్థానిక వినుకొండ పట్టణంలోని హనుమాన్నగర్లోని ఆంధ్రప్రదేశ్ గిరిజన గురుకుల పాఠశాల (బాలుర) నందు 2025–26 విద్యాసంవత్సరానికి తరగతుల్లో ఖాళీలకు దరఖాస్తులు కోరుతున్నట్లు పాఠశాల ప్రిన్సిపాల్ వై. శివరామకృష్ణ తెలిపారు. 5వ తరగతిలో ఎస్టీ–30, ఎస్సీ–5, బీసీ–2, ఓసీ–1, పీహెచ్సీ–1, గిరిజన ప్రాంతీయ ఉద్యోగులు –1, బ్యాక్ లాగ్ పోస్టులు (ఎస్టీ విద్యార్థులకు మాత్రమే), 6వ తరగతిలో 21, 8వ తరగతిలో 6, 9వ తరగతిలో 9 కలవు. పూర్తి చేసిన దరఖాస్తులను మే నెల 20వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు పాఠశాల కార్యాలయంలో అందజేయాలన్నారు.
ఏపీ మోడల్ స్కూల్ ఆరవ తరగతి ప్రవేశ పరీక్ష ఫలితాలు
క్రోసూరు: క్రోసూరులోని ఏపీ మోడల్ స్కూల్నందు ఆరవ తరగతి ప్రవేశపరీక్ష (2025–26) ఫలితాలను ప్రకటించినట్లు పాఠశాల ప్రిన్సిపాల్ మేరీసుజన్ గురువారం తెలిపారు. రోస్టర్, మెరిట్ ప్రాతిపదికన సీట్లు కేటాయించి సీటు వచ్చిన విద్యార్థులకు ఫోను ద్వారా తెలియజేయనున్నట్టు చెప్పారు. ఫలితాలను పాఠశాలలోని నోటీసు బోర్డులో కూడా చూడవచ్చని పేర్కొన్నారు.
డివిజన్ పరిధిలో పళ్లు రైళ్లు రద్దు
లక్ష్మీపురం: దక్షిణ మధ్య రైల్వే గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలో ఇంజినీరింగ్ పనులు జరుగుతున్న నేపథ్యంలో పలు రైళ్లను రద్దు చేయడం జరిగిందని డివిజన్ సీనియర్ డీసీఎం ప్రదీప్కుమార్ గురువారం తెలిపారు. చర్లపల్లి–తిరుపతి(07257) ఈనెల 8వ తేదీ నుంచి 29వ తేదీ వరకు, తిరుపతి–చర్లపల్లి(07258) రైలు ఈనెల 9వ తేదీ నుంచి 30వ తేదీ వరకు రద్దు చేయడం జరిగిందన్నారు. అలాగే గుంటూరు– రేపల్లె(67249), రేపల్లె–గుంటూరు(67250) గుంటూరు–రేపల్లె(67223), రేపల్లె–గుంటూ రు(67224), రేపల్లె–తెనాలి(67230), తెనాలి–రేపల్లె (67231), రేపల్లె–తెనాలి (67232), తెనాలి–రేపల్లె (67233) రేపల్లె–గుంటూరు (67234)విజయవాడ–తెనాలి(67221) రైళ్లను ఈనెల 4వ తేదీన రద్దు చేయడం జరిగిందని తెలిపారు. ప్రయాణికులు గమనించి సహకరించాల్సిందిగా తెలియజేశారు.
సాగర్ నీటిమట్టం
విజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం గురువారం 514.210 అడుగుల వద్ద ఉంది.ఇది 138.7364 టీఎంసీలకు సమానం.