
యోగాతో శారీరక దృఢత్వం, మానసిక ఉల్లాసం
నరసరావుపేట: యోగాతో శారీరక దృఢత్వంతోపాటు మానసిక ఉల్లాసం కలుగుతుందని కలెక్టర్ పి.అరుణ్బాబు పేర్కొన్నారు. యోగాంధ్రలో భాగంగా ఆదివారం నరసరావుపేటలోని పల్నాడు బస్టాండ్, పెద్ద చెరువు రోడ్డు వద్ద కార్యక్రమాలను పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ యోగా అనేది ప్రతి ఒక్కరి దైనందిన జీవితంలో భాగస్వామ్యం కావాలని తెలిపారు. ప్రతి ఒక్కరూ రోజూ 30 నిమిషాల నుంచి గంట వరకు యోగాభ్యాసం చేయాలని సూచించారు. యోగాతో శారీరక రుగ్మతలు దూరమవుతాయని పేర్కొన్నారు. యోగా అనేది చాలా ప్రాచీనమైనదని, వందల ఏళ్ల నుంచి గుర్తింపు పొందిందని అన్నారు. జూన్ 21 వరకు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తామని, శిక్షణ అనంతరం యోగాను ప్రతిరోజూ సాధన చేయాలన్నారు. తద్వారా ఆయుష్షు పెరుగుతుందని, యోగ సాధనపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని ఆయన సూచించారు. వందల మంది పాల్గొని యోగాభ్యాసం చేశారు. జిల్లా పేదరిక నిర్మూలన సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఝాన్సీరాణి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
స్మార్త వేద పాఠశాలలో ప్రవేశాలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థాన ఆధ్వర్యంలో పోరంకిలో నిర్వహిస్తున్న స్మార్త వేద పాఠశాలలో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని ఈవో శీనానాయక్ పేర్కొన్నారు. ఈ నెల 5వ తేదీ నుంచి వేద పాఠశాల పునఃప్రారంభం కానుందని, విద్యాభ్యాసం కోసం విద్యార్థులు ప్రవేశ దరఖాస్తులను పొందవచ్చని పేర్కొన్నారు. సమాజ వికాసానికి తోడ్పడే వేద విద్య అభ్యున్నతికి, విద్యార్థులకు మెరుగైన భవిష్యత్తు కల్పించేందుకు దేవస్థానం కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు.