ఫ్రీ బస్సు రోడ్డు ఎక్కేనా ? | - | Sakshi
Sakshi News home page

ఫ్రీ బస్సు రోడ్డు ఎక్కేనా ?

Jun 2 2025 10:03 AM | Updated on Jun 2 2025 10:53 AM

ఫ్రీ

ఫ్రీ బస్సు రోడ్డు ఎక్కేనా ?

ఏడాదిగా బస్సుల కోసం మహిళల ఎదురుచూపు

పథకం అమలు కోసం బస్సులు, డ్రైవర్లు కరువు

జిల్లాలో మొత్తం 10.92లక్షల మంది మహిళలు

ఏడాదిగా రూ.147కోట్ల లబ్ధిని కోల్పోయిన మహిళలు

కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో మాదిరిగా ప్రతి మహిళా ఉచితంగా ప్రయాణించేలా ఉచిత బస్సు (ఫ్రీ బస్సు) పథకం అమలు చేస్తానని ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఊదరగొట్టారు. మాయ మాటలు చెప్పి మహిళలతో ఓట్లు వేయించుకున్నారు. అధికారం చేపట్టి ఏడాది గడుస్తున్నా ఇప్పటివరకు దాని అతీగతీ లేదు. తొలుత దసరా అన్నారు.. తర్వాత దీపావళి.. ఆ తర్వాత సంక్రాంతి అన్నారు..చివరకు వచ్చే ఆగస్టు 15 నుంచి అమలు చేస్తానని మహానాడులో ప్రకటించారు. ఇదీ కష్టమేనని ఆర్టీసీ పరిస్థితులపై అవగాహన ఉన్న సంస్థ ఉద్యోగులు అంటున్నారు.

నరసరావుపేట: పక్కనే ఉన్న తెలంగాణ, కర్ణాటక ప్రభుత్వాలు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీని అమలు చేసి చూపితే, మన రాష్ట్ర పెద్దలు మాత్రం మీనమేషాలు లెక్కిస్తున్నారు. అదేమంటే గత ప్రభుత్వం ఆర్థిక విధ్వంసానికి పాల్పడటంతో అమలు చేయలేకపోతున్నామంటూ కుంటి సాకులు చెబుతున్నారు. అధికారంలోకి వస్తే సంపద సృష్టించి, ప్రజలకు పథకాలు అమలుచేస్తానన్న చంద్రబాబు ఇప్పుడు సాకులు వెతుకుతుండటం శోచనీయమని మహిళలు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీ సాక్షిగా పథకాలు అమలు చేయాలంటే భయంగా ఉందంటూ చంద్రబాబు వ్యాఖ్యలపై మహిళలు, ప్రజలు విస్తుపోతున్నారు. అసలు ఫ్రీ బస్సు అమలు చేస్తారా లేదా అని సందేహం వ్యక్తం చేస్తున్నారు. పథకం అమలుపై ఇప్పటి వరకు ముఖ్యమంత్రి, మంత్రి, అధికారులు చర్చించిన దాఖలాలు లేవు.

జిల్లా కేంద్రానికి నిత్యం రాకపోకలు
మూడేళ్ల కిందట నరసరావుపేట కేంద్రంగా పల్నాడు జిల్లా ఏర్పాటైంది. దీంతో పలు ప్రాంతాల నుంచి మహిళా ఉద్యోగులు, ఉపాధి కోసం మహిళా కూలీలు జిల్లా కేంద్రానికి ప్రతిరోజూ రాకపోకలు చేస్తున్నారు. వందలాది మంది విద్యార్థినులు ఇంజినీరింగ్‌తో పాటు పలు ఉన్నత విద్యా విద్యా సంస్థలకు రాకపోకలు సాగిస్తున్నారు. జిల్లా కేంద్రమైన నరసరావుపేట డిపో ద్వారా ఆర్టీసీ 90 బస్సుల ద్వారా 106 సర్వీసులను నడుపుతోంది. అందులో 65 బస్సులు సంస్థవి కాగా, మరో 25 అద్దెవి. వీటిలో పల్లె వెలుగు 47 బస్సులు ఉన్నాయి. మిగిలినవి హైటెక్‌, అల్ట్రా, ఎక్స్‌ప్రెస్‌ బస్సులు. ప్రతిరోజూ ప్రయాణికుల ద్వారా రూ.13 లక్షల నుంచి రూ.14లక్షల వరకు ఆదాయం సమకూరుతోంది. జిల్లావ్యాప్తంగా సంస్థకు నరసరావుపేట, చిలకలూరిపేట, వినుకొండ, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, మాచర్ల ఉన్నాయి. ఫ్రీ బస్సు ఏ విధంగా అమలుచేస్తారనే దానిపై ఇప్పటివరకు స్పష్టత లేదు. కేవలం జిల్లాకు లేదా నియోజకవర్గానికే పరిమితం చేస్తామని కూటమి నేతలు లీకులు వదులుతున్నారు.

మహిళలకు ఎంతో ఉపయోగం

తెలంగాణలో పథకం అమలు చేసినా ఇక్కడ ఏడాదిగా అమలు చేయకపోవడం దారుణం. చంద్రబాబుకు ఉచితంగా ఇచ్చే మనస్తత్వం లేదు. పేదలంటే పడదు. వారికేమి చేయడు. ఫ్రీ బస్సు పథకం అమలుచేస్తే మహిళలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
–ఎస్‌.సుజాతాపాల్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి, వైఎస్సార్‌ సీపీ , నరసరావుపేట

ఇప్పటి వరకు ప్రణాళిక లేదు

ఉచిత బస్సు గురించి ఇప్పటి వరకు మాకెటువంటి సంకేతం అందలేదు. జిల్లాలో కూడా సర్వే చేయలేదు. ప్రభు త్వం ఆదేశిస్తే ఉన్న బస్సులతోనే పథకం అమలుచేసేందుకు ప్రయత్నాలు చేస్తాం.
– ఎం.మధు,

ఆర్టీసీ జిల్లా ప్రజా రవాణా అధికారి
పల్నాడు జిల్లాలో ఐదేళ్ల మొత్తం 10,92,732మంది మహిళలకు బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పించాల్సి ఉంది. అయితే, ఇప్పటి వరకు ప్రభుత్వం ఆ దిశగా ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు. దీని వల్ల ఉపాధి, ఉద్యోగాలు, వైద్యం, వివిధ పనులపై నిత్యం బస్సుల్లో ప్రయాణించే మహిళలు ఆర్థికంగా నష్టపోతున్నారు. జిల్లాలో ప్రస్తుతం ఆర్టీసీ పరిధిలో 461బస్సులు నిత్యం 2995 ట్రిప్పులు చొప్పున రోజుకు 1.73,573 కిలోమీటర్లు తిరుగుతున్నాయి. రోజుకు సగటున 1,41,717మంది మహిళలు ప్రయాణిస్తుండగా రూ.59.22లక్షల ఆదాయం సమకూరుతోంది. ఉచిత పథకం సరిగా అమలుచేస్తే జిల్లాలోని మహిళలకు ఏడాదికి రూ.146కోట్లు లబ్ధి చేకూరనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement