ఏపీ ఈఏపీసెట్‌లో విద్యార్థుల ప్రతిభ | - | Sakshi
Sakshi News home page
breaking news

ఏపీ ఈఏపీసెట్‌లో విద్యార్థుల ప్రతిభ

Jun 9 2025 10:16 AM | Updated on Jun 9 2025 10:16 AM

ఏపీ ఈఏపీసెట్‌లో విద్యార్థుల ప్రతిభ

ఏపీ ఈఏపీసెట్‌లో విద్యార్థుల ప్రతిభ

ఇంజినీరింగ్‌లో రాష్ట్రస్థాయిలో 6వ ర్యాంకు సాధించిన గుంటూరు విద్యార్థి

గుంటూరు ఎడ్యుకేషన్‌: కాకినాడ జేఎన్‌టీయూ ఆదివారం ప్రకటించిన ఏపీ ఈఏపీసెట్‌–2025 ఫలితాల్లో ఉమ్మడి గుంటూరు జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. గత నెల 18 నుంచి 27వ తేదీ వరకు జరిగిన ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ కోర్సుల ఉమ్మడి ప్రవేశ పరీక్ష (ఏపీ ఈఏపీసెట్‌) ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో గుంటూరు నగరానికి చెందిన తెలగతోటి విక్రమ్‌ లెవీ 6వ ర్యాంకు కై వసం చేసుకున్నాడు. గుంటూరులోని భాష్యం ఐఐటీ–జేఈఈ అకాడమీలో చదివిన విక్రమ్‌ లెవీ టెన్త్‌, ఇంటర్మీడియెట్‌ స్థానికంగానే చదివాడు. విద్యార్థి తండ్రి పిచ్చయ్య విజ్ఞాన్‌ యూనివర్సిటీలో సీఎస్‌ఈ విభాగ ప్రొఫెసర్‌ కాగా.. తల్లి ఇవాంజిలిన్‌ విజయవాడలోని మేరీ స్టెల్లా కళాశాలలో అధ్యాపకురాలు. విద్యార్థులందరూ కంప్యూటర్‌ సైన్స్‌ను ఎంపిక చేసుకుంటుండగా, అందుకు భిన్నంగా విక్రమ్‌ లెవీ ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ను ఎంపిక చేసుకున్నాడు. ఇటీవల విడుదలైన జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో జాతీయ స్థాయి ఓపెన్‌ కేటగిరీలో 146వ ర్యాంకు కై వసం చేసుకున్న విక్రమ్‌ లెవీ ముంబై ఐఐటీలో ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌లో చేరేందుకు ఆప్షన్‌ నమోదు చేసుకున్నాడు. స్టార్టప్‌ కంపెనీ ప్రారంభించే లక్ష్యంతో ఉన్న విక్రమ్‌ లెవీ పరిశోధనల దిశగా ముందుకు వెళ్లాలనే కోరికను వెలిబుచ్చాడు.

ఇంజినీరింగ్‌ టాప్‌–100లోపు ర్యాంకర్లు వీరే

గుంటూరులోని వేంకటేశ్వరకాలనీకి చెందిన అంబటి నోషిక్‌ సాయి 25వ ర్యాంకు, నరసరావుపేట విద్యార్థి కల్లూరి శ్రీరాఘవ – 46, గుంటూరు ముత్యాలరెడ్డి నగర్‌కు చెందిన విన్నకోట మహేష్‌ చంద్ర – 56, తెనాలికి చెందిన నల్లా శాన్వి సాయి వీర – 67, తాడేపల్లికి చెందిన గుమ్మడిదల హేమంత్‌ సాయిరామ్‌ – 76, గుంటూరుకు చెందిన గుత్తికొండ సాయి మనోజ్ఞ – 98, చందులూరి నాగవెంకట నీరజ్‌ – 99, గుంటూరు రూరల్‌ గొర్లవారిపాలెంకు చెందిన నల్లపనేని సుజిత్‌ 100వ ర్యాంకు సాధించారు.

అగ్రికల్చర్‌, ఫార్మసీలో...

అగ్రికల్చర్‌, ఫార్మసీ టాప్‌–100 ర్యాంకర్లలో గుంటూరు కొత్తపేటకు చెందిన పసుపులేటి రుద్ర శ్రీ గణేష్‌ 15వ ర్యాంకు, సత్తెనపల్లికి చెందిన కటకం ఏకేఎన్‌ హరి కిరణ్‌ –16, గుంటూరు కొరిటెపాడుకు చెందిన ఉమా శంకర్‌ తారిక శ్రీ – 28, అమరావతి రోడ్డుకు చెందిన కారుమంచి విక్రాంత్‌ –32, గుజ్జనగుండ్లకు చెందిన ఉప్పాల రూపశ్రీ – 40, కొలకలూరుకు చెందిన గుమ్మడిదల తేజాస్‌ – 54, చంద్రమౌళీనగర్‌కు చెందిన వేముల అన్విత్‌ చేతన్‌ – 67, శ్రీనగర్‌కు చెందిన ఓగిబెయిన సుష్మ కౌస్తుభరాణి – 96, పొన్నూరుకు చెందిన కూరాకుల శ్రీరామ్‌ యాదవ్‌ – 97, గుంటూరు విజయపురికాలనీకి చెందిన గుంటుపల్లి శ్రీలేఖ 110వ ర్యాంకు సాధించారు.

నరసరావుపేట ఈస్ట్‌: పల్నాడు జిల్లా నుంచి ఇంజినీరింగ్‌కు హాజరైన 8,944 మంది విద్యార్థుల్లో 6,095, అగ్రి,ఫార్మసీలో 1,802 మంది విద్యార్థుల్లో 1,652 మంది ఉత్తీర్ణులయ్యారు.

మధుసూదనరెడ్డికి 200 ర్యాంక్‌..

మండలంలోని రంగారెడ్డిపాలెం గ్రామానికి చెందిన ఏరువ మధుసూదనరెడ్డి ఇంజినీరింగ్‌ విభాగంలో 200 ర్యాంక్‌ సాధించాడు. కంప్యూటర్‌ సైన్స్‌ విభాగంలో చేరనున్నట్లు మధుసూదనరెడ్డి తెలిపాడు.

సత్తెనపల్లి విద్యార్ధుల ప్రతిభ

సత్తెనపల్లి: ఏపీ ఈఏపీసెట్‌లో అగ్రికల్చర్‌, ఫార్మసీ విభాగంలో పల్నాడు జిల్లా సత్తెనపల్లి విద్యార్థులు సత్తా చాటారు. సత్తెనపల్లి గాంధీ చౌక్‌ సమీపంలోని భవిరిశెట్టి వారి స్ట్రీట్‌కు చెందిన కటకం వెంకట నాగ సర్వేశ్వరరావు, శిరీష దంపతుల కుమారుడు కటకం అనంత కోటి నాగ హరికిరణ్‌ జిల్లా స్థాయిలో 16వ ర్యాంకు సాధించాడు. సత్తెనపల్లికి చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్‌ గజ్జల నాగ భూషణ్‌ రెడ్డి, డాక్టర్‌ గజ్జల శారదారెడ్డి దంపతుల కుమారుడు సాయి కౌషిక్‌ రెడ్డి 82వ ర్యాంకు కై వసం చేసుకున్నాడు. సత్తెనపల్లి మండలం పెదమక్కెన గ్రామానికి చెందిన రైతు వద్ధుల వెంకటరెడ్డి, పద్మ దంపతుల కుమారుడు వద్దుల హంద్రీ రామ్‌రెడ్డి 89వ ర్యాంకును సాధించాడు. ముగ్గురు విద్యార్థులు ఎంబీబీఎస్‌ చేయడమే తమ లక్ష్యంగా చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement