
కూటమి మోసాలను ఎండగట్టేందుకే ‘వెన్ను పోటు’ దినం
చిలకలూరిపేటటౌన్/యడ్లపాడు: వెన్నుపోటుకు ఆద్యుడు..వెన్నుపోటుకే ఓ ప్రత్యేక దినం అవసరాన్ని తెచ్చిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకే దక్కుతుందని మాజీమంత్రి, వైఎస్సార్సీపీ చిలకలూరిపేట నియోజకవర్గ ఇన్చార్జి విడదల రజిని విమర్శించారు. చిలకలూరిపేటలో జూన్ 4వ తేదీన వైఎస్సార్ సీపీ ఆధ్వర్యాన జరగనున్న ‘వెన్నుపోటు దినం’ కార్యక్రమ పోస్టర్ను పార్టీశ్రేణులతో కలిసి ఆదివారం ఆమె నివాసంలో ఆవిష్కరించారు. ప్రజల మద్దతుతో జరిగే ఈ నిరసన ర్యాలీని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. 2024 జూన్ 4న అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ‘సూపర్సిక్స్’ పాటు మరో 143 హామీలు ఇచ్చిందని, ఏడాది గడిచినా ఒక్క దాన్ని కూడా అమలు చేయలేదని అన్నారు. సంక్షేమ పథకాల అమలు ద్వారా ప్రజల ఖాతాల్లో నేరుగా నగదు జమచేసి పారదర్శక పాలన అందించి దేశంలోనే రాష్ట్రాన్ని ఆదర్శంగా నిలిపి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చరిత్ర సృష్టించారన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా అరాచక పాలన సాగిస్తూ..నిత్యం కల్లబొల్లి మాటలతో ప్రజలను చంద్రబాబు మభ్య పెడుతున్నారన్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని తిట్టడమే పార్టీ ఎజెండాగా పెట్టుకున్నారంటూ ఎద్దేవా చేశారు. అధికారంలోకి వచ్చాక వైఎస్సార్ సీపీ కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని కుట్రలు పన్నుతున్నారని, రాష్ట్రంలో శాంతిభద్రతలు గల్లంతవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వ అరాచకాలను ప్రతి ఒక్కరూ గమనిస్తున్నారని, తగిన సమయంలో ప్రజలే గుణపాఠం చెబుతారని రజిని హెచ్చరించారు. జూన్ 4న జరగనున్న ‘వెన్నుపోటు దినం’ కేవలం నిరసన కార్యక్రమం కాదని, అది హామీలను నెరవేర్చని కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించే ప్రజల గళం అని పేర్కొన్నారు. పట్టణంతోపాటు నియోజకవర్గంలోని మూడు మండలాలకు చెందిన వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు స్వచ్ఛందంగా కదిలి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రజిని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పల్నాడు జిల్లా యూత్ అధ్యక్షుడు కందుల శ్రీకాంత్, జిల్లా వైస్ప్రెసిడెంట్ మద్దూరి కోటిరెడ్డి, మాజీ ఎంపీపీ మద్దూల విజయబాలచంద్రారెడ్డి, రూరల్ ఎంపీపీ దేవినేని శంకర్రావు, రాష్ట్ర మైనార్టీ సంక్షేమ మాజీ డైరెక్టర్ షేక్ దరియావలి, సింగారెడ్డి కోటిరెడ్డి, కల్లి వెంకటరెడ్డి, మైలా రాజేష్, పందుల బుల్లెబ్బాయి, వడ్డేపల్లి నర్సింహరాజు, కుప్పాల ప్రభుదాసునాయుడు పాల్గొన్నారు.
మాజీమంత్రి విడదల రజిని
4న చిలకలూరిపేటలో భారీ ర్యాలీ
ప్రజలతో కలిసి అధికారులకు
వినతిపత్రాల సమర్పణ
పార్టీ శ్రేణులతో కలిసి పోస్టర్
ఆవిష్కరణ