
మళ్లీ రేషన్ కష్టాలు
గుంటూరు వెస్ట్: రేషన్ పంపిణీ తొలిరోజే విఫలమైంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఎండీయూ వాహనాలను కాదని రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ ప్రారంభించింది. దీని కోసం నాయకులతోపాటు కార్యకర్తలను రేషన్ దుకాణాలకు పంపి హడావుడి చేసింది. ప్రజలు చాలా వరకు ఇళ్లకే పరిమితమయ్యారు. చాలాచోట్ల ఈ పోస్ మిషన్లు పనిచేయక ప్రజలు ఇబ్బందులు పడ్డారు. పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యురాలు గళ్లా మాధవి స్థానిక ఏటీ అగ్రహారం రేషన్ దుకాణం నెంబర్ 0781174ను ప్రారంభించారు. కొద్ది సేపటికే అక్కడ ఈ పోస్ మిషన్ మొరాయించింది. జిల్లాలో మొత్తం 972 రేషన్ దుకాణాలున్నాయి. 5,99,511 మందికి సుమారు 9 వేల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పంపిణీ చేయాల్సి ఉంది. తొలి రోజు మాత్రం పెద్దగా స్పందన లేదు. గత ప్రభుత్వ హయాంలో ఇంటింటికీ ఎండీయూ వాహనాల ద్వారా రేషన్ పంపిణీ చేసేటప్పుడు పేదలకు ఎంతో సౌలభ్యంగా ఉండేది. ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నామని కార్డుదారులు వాపోతున్నారు.
తప్పని సమస్యలు
చాలా దుకాణాల్లో సర్వర్ మొరాయించింది. కొన్ని చోట్ల నెమ్మదించింది. దాదాపు 5 సంవత్సరాల పాటు ఈ పోస్ మిషన్లు, వేయింగ్ మిషన్లు వాడకపోవడంతో అవి చాలా వరకు పాడైపోయాయి. ఇంటి వద్దకే రేషన్ తీసుకోవడానికి అలవాటు పడ్డ ప్రజలు దుకాణాలకు వెళ్లేందుకు ఇష్టపడడం లేదు. కొన్ని చోట్ల లైన్లు కనబడగా, మరికొన్ని చోట్ల ఎవ్వరూ రాలేదు. మిషన్లు పనిచేయకపోవడంతో ప్రజలు తిరిగి వెళ్లిపోయారు. కూటమి నేతలు తమ కార్యకర్తలను తీసుకుని రేషన్ దుకాణాల్లో హాల్చల్ చేయడం కనిపించింది. రేషన్ తీసుకోవాలని కొంత వరకు స్థానికంగానూ ప్రచారం చేశారు. ఎండీయూ వాహనాల్లో అక్రమాలు జరుగుతున్నాయని ప్రచారం చేస్తున్న ప్రభుత్వం రేషన్ దుకాణదారులు చేసే అక్రమాలను ఎలా నివారిస్తోందో చెప్పకపోవడం విడ్డూరంగా ఉందని పలువురు పేర్కొన్నారు.
తొలిరోజు సరకుల
పంపిణీలో తీవ్ర ఇబ్బందులు
పలుచోట్ల ఈ– పోస్ మిషన్లు
మొరాయింపు
పనిచేయని ఎమ్మెల్యే మాధవి
ప్రారంభించిన దుకాణం
ఇంటివద్దకే సరకులు ఇచ్చే వ్యవస్థ
నాశనం చేసిన కూటమి ప్రభుత్వం
పాలకుల తీరుపై ప్రజలు తీవ్ర ఆగ్రహం