
లిఫ్ట్ నుంచి జారిపడి కార్మికురాలు మృతి
మాచర్ల రూరల్: కందిపప్పు మిల్లులో పనిచేస్తూ లిఫ్ట్ నుంచి జారిపడి మహిళ గాయాలపాలై చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన సోమవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం ఈ నెల 13వ తేదిన మండలంలోని రాయవరం జంక్షన్ సమీపంలోని తపస్వి లక్ష్మీ బాలాజి డాల్ మిల్లులో పనిచేసే కూరాకుల కాశమ్మ (44) రోజూ లాగానే మిల్లులో పనిచేసేందుకు వెళ్లింది. లిఫ్ట్లో నుంచి కిందికి వచ్చే సమయంలో బెల్టు తెగి కిందపడిపోయింది. ఈ సమయములో నడుముకు, కాలుకు తీవ్ర గాయమైంది. గాయపడిన ఆమెను మాచర్ల ప్రభుత్వాసుపత్రిలో చికిత్స జరిపి మెరుగైన వైద్యం నిమిత్తం నరసరావుపేటలో ఓ ప్రైవేటు వైద్యశాలలో చేర్పించారు. అక్కడ మహిళ కాశమ్మ నడుముకు, కాలుకు శస్త్ర చికిత్స నిర్వహించారు. వైద్యశాలలో చికిత్స పొందుతున్న కాశమ్మ సోమవారం సాయంత్రం మృతి చెందింది. కాశమ్మ భర్త నరసింహారావు కరోనా సమయంలో మృతి చెందాడు. మృతురాలు కాశమ్మకు ఇద్దరు ఆడపిల్లలు, ఒక మగపిల్లవాడున్నారు. కాశమ్మ మృతదేహాన్ని మంగళవారం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తీసుకొచ్చి పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని బంధువులకు అప్పగించినట్లు రూరల్ ఎస్ఐ రవిబాబు తెలిపారు.
పురుగుమందు తాగి వ్యక్తి ఆత్మహత్య
చీరాల: పురుగుమందు తాగి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంగళవారం చీరాలలో చోటుచేసుకుంది. ఒన్టౌన్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు... ఇంకొల్లుకు చెందిన శివాజి (35) మంగళవారం చీరాలలోని ఓ లాడ్జి సమీపంలో పురుగుమందు తాగాడు. అపస్మారక స్థితిలో ఉన్న అతడిని చికిత్స నిమిత్తం వైద్యశాలకు తరలించగా అప్పటికే మృతిచెందాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ మేరకు ఒన్టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.