
పీహెచ్సీ సిబ్బందితో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్ శివశంకర్
మాచవరం: అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందేలా చూడాలని పల్నాడు జిల్లా కలెక్టర్ లోతేటి శివశంకర్ ఆదేశించారు. మాచవరం మండలంలో శుక్రవారం ఆయన ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. తహసీల్దారు కార్యాలయంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. రెవెన్యూ, అభివృద్ధి కార్యక్రమాల పనితీరుపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. తహసీల్దారు కార్యాలయంలో కుప్పలుగా పడిఉన్న పాత రికార్డులను చూసి, రికార్డులను వెంటనే గదిలో భద్రపర్చాలని సూచించారు. రెవెన్యూ సమస్యలను వెంటనే పరిష్కరించేలా చూడాలని తెలియజేశారు. అభివృద్ధి కార్యక్రమాలపై మండల పరిషత్ అధికారులతో సమీక్షించారు. ప్రభుత్వ ద్వారా మంజూరైన పనులు త్వరగా పూర్తయ్యేలా చూడాలన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. రికార్డులను పరిశీలించారు. కాన్పుల గదులు, రోగులకు వసతి కల్పన, పరిసరాల పరిశుభ్రత తదితర అంశాలపై సిబ్బందితో చర్చించారు. ఉద్యోగుల పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. పీహెచ్సీ జిల్లాలో మొదటి ర్యాంకు సాధించాలని సూచించారు.
అనంతరం పిల్లుట్లలో కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాన్ని సందర్శించారు. విద్యార్దులతో మాట్లాడారు. ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని చెప్పారు. మెనూ, వసతి తదితర అంశాలపై సిబ్బందితో మాట్లాడారు. విద్యార్థులకు ఆట స్థలాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ద్వారా సహకారం అందిస్తామన్నారు. విద్యార్థులు నూరుశాతం ఉత్తీర్ణత సాధించాలని ఆకాంక్షించారు. రుక్మిణీపురంలో నూతనంగా నిర్మించిన సచివాలయాన్ని పరిశీలించారు. సచివాలయ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. సచివాలయాల ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని తెలియజేశారు. కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి శ్రీకృష్ణదేవరాయలు, ఎంపీడీఓ వై.రాజగోపాల్, డీటీ సుబ్బారావు, ఏపీఎం శివశంకర్, ఏపీఓ వెంకటేశ్వర్లు, ఏఈలు సురేష్ వెంకటేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.