లిబ్రిగుడలో..
● నెల రోజులుగా పనిచేయని
మంచినీటి పథకం
● బావిలోని బురదనీరే దిక్కు..
● పట్టించుకోని అధికారులు
పర్లాకిమిడి: గజపతి జిల్లాలో నువాగడ బ్లాక్ పరిమళ పంచాయతీ లిబ్రిగుడ గ్రామంలో నెల రోజులుగా ప్రజలు తాగునీటికోసం అనేక అవస్థలు పడుతున్నారు. వంద కుటుంబాలు ఉన్న లిబ్రిగుడలో గ్రామీణ తాగునీటి, శానిటేషన్ శాఖ మంచినీటి పథకం నిర్మించినా.. నాలాల నుంచి తాగునీరు రావడం లేదు. గ్రామంలో ట్యూబ్ వెల్ కోన్నేళ్లుగా మరమ్మతులకు గురైంది. ఉన్న ఒక్క మంచినీటి బావి ఎండలకు అడుగంటింది. ఓవర్ హెడ్ ట్యాంకు నుంచి తాగునీరు రావడం లేదు. మంచినీటి బావి నుంచి బురదనీరు వడబోసి ప్రజలు తాగుతున్నారు. గ్రామంలో పిల్లలు, వృద్ధులు దగ్గు, జ్వరాల బారిన పడుతున్నట్టు లిబ్రిగుడ గ్రామసభ సభ్యుడు బిశ్వంబర రయితో ఆందోళన చెందుతున్నారు. తాగునీటి సమస్యలపై ఏప్రిల్ 6న లిబ్రిగుడ గ్రామవాసులు పర్లాకిమిడి కలెక్టరేట్లో అధికారులకు వినతిని అందజేశారు. అధికారులు ప్రభుత్వ గ్రామీణ తాగునీరు, శానిటేషన్ ఇంజినీర్కు వినతిని పంపారు. ఇప్పటివరకు నువాగడ బ్లాక్ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. గ్రామంలో మహిళలు తాగునీటికి ఆందోళన చెందుతున్నారు. దీనిపై మోహనా ఎమ్మెల్యే దాశరథి గోమాంగో తగిన చర్యలు తీసుకోవాలని లిబ్రిగుడ గ్రామస్తులు కోరుతున్నారు.


