● సబ్ కలెక్టర్ను కోరిన మాజీ
సర్పంచ్ త్రిపాఠి
జయపురం: మాజీ సర్పంచ్ నిరంజన్ త్రిపాఠీ ఆత్మహత్య చేసుకొనేందుకు జయపురం సబ్ కలెక్టర్ను అనుమతి కోరారు. త్రిపాఠి వ్యవసాయం వదలి కంట్రాక్ట్ పనులు చేస్తున్నారు. చేసిన పనుల బిల్లుల పాస్ చేసేందుకు అధికారులు లంచాలు అడగటంతో మనో వేదన చెందిన త్రిపాఠి ఆత్మహత్య చేసుకొనేందుకు నిర్ణయించి స్వచ్ఛందంగా ఆత్మహత్య చేసుకొనేందుకు అనుమతి కోరడం గమనార్హం. వ్యవసాయ దారుడైన త్రిపాఠీ 2022 లో బొరిగుమ్మ సమితి బెణాపూర్ పంచాయితీ బాగభధ్ర గ్రామం సమీపంలో గల తన 8 ఎకరాల భూమిని అమ్మి వేసి బొరిగుమ్మ సమితిలో కంట్రాక్టు పనులు చేయటం ప్రారంభించారు. 2023–24, 2024–25 ఆర్థిక సంవత్సరాల కాలంలో మనోరెగ పనుల కాంట్రాక్ట్ తీసుకున్నారు. బాగభధ్ర గ్రామంలో 5–టి విద్యాలయ ప్రహరీ, యూజీహెచ్సీ విద్యాలయ ప్రహరీ, సమితి రోడ్డు పనులు, గ్రామాల అప్రోచ్ రోడ్డు పనులకు అనుమతులు లభించాయి. ఆ పనులు చేస్తున్న త్రిపాఠీ మనోరెగ పనుల్లో కూలీలకు కాంట్రాక్ట్ పనుల కోసం పనులకు తన డబ్బులు చెల్లించారు. అయితే బిల్లు పైకం చేతికి రాలేదు. బిల్లు పాస్ చేసేందుకు 27 శాతం పీసీ కావాలని సంబంధిత అధికారులు డిమాండ్ చేశారు. అయితే 12 శాతం ఇచ్చేందుకు త్రిపాఠీ అంగీకరించాడు. అందుకు సంబందిత అధికారులు ఎవరూ సమ్మతించలేదు. ఈ విషయం బీడీఓకు తెలియజేసినా ఫలితం లేక పోయిందని, అందు చేత మరో మార్గం కనిపించక ఆత్మహత్యే శరణ్యం అని భావించిన త్రిపాఠి సబ్ కలెక్టర్ను అనుమతి కోరాడు. ఈ ఆరోపణపై వెంటనే దర్యాప్తు జరిపి నివేదిక సమర్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. తనకు రావాల్సిన బిల్లు డబ్బు చెల్లించక పోతే ఆత్మహత్యకు అనుమతించాలని నిరంజన్ త్రిపాఠీ విజ్ఞప్తి చేశారు.


