భువనేశ్వర్: రాష్ట్ర ప్రజలకు నాణ్యమైన ప్రపంచ స్థాయి వైద్య సౌకర్యాల్ని సులభ రీతిలో కల్పించడమే ధ్యేయంగా హై టెక్ గ్రూపు వైద్య సంస్థలు పని చేస్తాయని వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ తిరుపతి పాణిగ్రాహి తెలిపారు. స్థానిక హైటెక్ వైద్య బోధన ఆస్పత్రి సముదాయంలో 2 కొత్త ఓపీడీలను ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన ఈ విషయం వెల్లడించారు. రోగులకు ఆధునిక, సరసమైన చికిత్సను అందించే లక్ష్యంతో ఆసుపత్రి గ్రౌండ్ ఫ్లోర్లో సర్జికల్ (శస్త్ర చికిత్స) విభాగం ఓపీడీని, చర్మ వ్యాధులు (డెర్మటాలజీ) విభాగం విస్తరించిన ఓపీడీని ప్రారంభించారు. హైటెక్ గ్రూప్ వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ తిరుపతి పాణిగ్రాహి, మేనేజింగ్ ట్రస్టీ సురేష్ పాణిగ్రాహి, డైరెక్టర్ డాక్టర్ రాకేష్ పాణిగ్రాహి ఈ రెండు విభాగాలను ప్రారంభించారు. ఈ కొత్త ఓపీడీలో ఆధునిక వైద్య పరికరాలు, అనుభవజ్ఞులైన శస్త్ర చికిత్స నిపుణులు, ప్రముఖ చర్మ వ్యాధి నిపుణులతో సంప్రదింపులు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. సామాన్యులకు సులభమైన, సత్వర ఆరోగ్య సేవల కోసం ఈ ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆస్పత్రికి చెందిన పలువురు సీనియర్ వైద్యులు, విభాగాధిపతులు, ఉద్యోగులు, నర్సింగ్ సిబ్బంది హాజరయ్యారు.


