
అనుమానాస్పద రీతిలో వ్యక్తి మృతి
భువనేశ్వర్: నయాగడ్ జిల్లాలో శనివారం విషాద సంఘటన వెలుగు చూసింది. శిశర్ సాహు అనే వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. సగం కాలిపోయిన మృతదేహాన్ని నయాగడ్ జిల్లా బారొమాసి గ్రామంలో అటవీ శాఖ అధికారి (ఫారెస్టర్) స్వాధీనపరచుకున్నారు. శుక్రవారం రాత్రి పూట నిప్పు అంటించడంతో ఈ ఘటన సంభవించి ఉంటుందని భావిస్తున్నారు. మృతుడిని నయాగఢ్ జిల్లా పంచరిద ఫారెస్ట్ రేంజ్కు చెందిన ఫారెస్టర్ శిశిర్ సాహుగా గుర్తించారు. అతను రెండు నెలల కిందట పంచరిద రేంజ్లో ఫారెస్టర్గా చేరాడు. రోజు మాదిరిగా శిశిర్ తన భార్య నమిత, కుమారునితో కలిసి నిద్ర పోయాడు. ఇంతలో అర్ధరాత్రి పూట ఇంట్లో మంటలు చెలరేగాయి. శిశిర్ భార్య అరుస్తూ ఇంటి నుంచి బయటకు వచ్చి ఇరుగు పొరుగు వారి సాయం కోరింది. ఈ సమాచారం అందుకున్న నయాగఢ్ అగ్ని మాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పారు. నయాగడ్ టౌన్ ఠాణా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఫారెస్టర్ మృత దేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు జరుగుతోంది. అగ్ని ప్రమాదానికి గల కారణాలు అస్పష్టంగా ఉండటంతో శిశిర్ సాహు మరణంపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. శిశిర్ తనను తాను నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్నాడా ... గిట్టని వారు ఎవరైనా తనపై కక్షతో ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారా ... అనే దిశలో అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో బంధుమిత్రులతో పోలీసులు సంప్రదిస్తున్నారు. భార్య వివాహేతర సంబంధాల అనుమానంతో తరచూ భర్తని వేధించేదని మృతుని బంధువర్గాల ఆరోపణ. ఈ నేపథ్యంలో తరచూ వీరి మధ్య కలహంతో ఇల్లు రణరంగంగా మారేదని తెలిపారు.

అనుమానాస్పద రీతిలో వ్యక్తి మృతి