
రోడ్డు ప్రమాదంలో యువతి దుర్మరణం
● ఇద్దరికి గాయాలు
రాయగడ:
జిల్లాలోని రామనగుడ సమితి పరికితి ఘాట్ రోడ్డు మలుపులో గురువారం జరిగిన ప్రమాదంలో యువతి మృతి చెందింది. మరో ఇద్దరు గాయాలపాలయ్యారు. మృతి చెందిన యువతి రుగుడుబాయి గ్రామానికి చెందిన పూర్ణిమ మండంగి (20)గా గుర్తించారు. గాయాల పాలైన వారు అదే గ్రామానికి చెందిన పాపిని మండంగి, శివ మండంగిగా సమాచారం. పూర్ణిమ, పాపిని, శివ స్కూటీపై రామనగుడ వెళ్తున్నారు.
పరికితి ఘాటీ మలుపు వద్ద వెనుక నుంచి లారీ వచ్చి స్కూటీని బలంగా ఢీకొంది. స్కూటీపై ఉన్న ముగ్గురు కొద్ది దూరం ఎగిరిపడ్డారు. ఈ ప్రమాదంలో పూర్ణిమ మండంగికి తీవ్రగాయాలు తగిలి సంఘటన స్థలం వద్దే మృతి చెందింది. గాయాల పాలైన ఇద్దరిని రామనగుడ ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు. లారీ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని గ్రామస్తులు రహదారిపై ఆందోళన చేపట్టారు. దీంతో వాహన రాకపోకలు నిలిచిపోయాయి. సమాచారం తెలుసుకున్న రామనగుడ పోలీస్ స్టేషన్ ఐఐసీ సునితా బెహర, గుణుపూర్ సబ్ కలెక్టర్ కిరణ్ దీప్ కౌర్ సహాట సంఘటన స్థలానికి చేరుకుని ఆందోళనకారులను బుజ్జగించే ప్రయత్నం చేశారు. లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకుని, బాధిత కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. సమస్యను పరిష్కరించే దిశగా కృషి చేస్తానని సబ్ కలక్టర్ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.

రోడ్డు ప్రమాదంలో యువతి దుర్మరణం