
జిల్లా కేంద్రాస్పత్రిలో బాలింత మృతి
జయపురం: జయపురం ఫూల్బెడ ప్రాంతంలో గల కొరాపుట్ జిల్లా కేంద్రాస్పత్రిలో ఒక బాలింత గురువారం సాయంత్రం మృతి చెందింది. డాక్టర్ల నిర్లక్ష్యం వల్లనే ఆమె చనిపోయిందని మృతురాలి బంధువులు ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. సదర్ పోలీసు అధికారులు వచ్చి ఆందోళన కారులను శాంత పరచారు. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. జయపురం సబ్డివిజన్ బొయిపరిగుడ హనుమాన్ నగర్ ప్రాంతానికి చెందిన పూర్ణిమ బాగ్ నిండు గర్భిణి. ఆమెను బంధువులు బొయిపరిగుడ కమ్యూనిటీ ఆస్పత్రిలో చేర్చారు. మెరుగైన వైద్యం కోసం ఆమెను జయపురం ఫూల్బెడలో గల జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. ఆమె పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారని డాక్టర్లు వెల్లడించారు. అయితే అకస్మాత్తుగా పూర్ణిమ ఆరోగ్య పరిస్థితి క్షీణించింది. ఆమె బీపీ ెపెరగటంతో పాటు ఆమె శ్వాస తీయటం కష్టంగా మారింది. వెంటనే బంధువులు డాక్టర్ను పిలవమని నర్సుకు తెలిపారు. కానీ డాక్టర్ రావడం ఆలస్యం చేశారు. సకాలంలో వైద్యం అందకపోవడం వల్లనే పూర్ణిమ చనిపోయిందని భర్త విజయ సాగరిక ఆరోపించారు. బంధువులు, గ్రామస్తులు ఆస్పత్రికి చేరుకుని ఆందోళన చేశారు. డాక్టర్ను పిలిపించి వాప్తవం తెలుసుకొని సముచిత నిర్ణయం తీసుకుంటామని హామీ ఈయటంతో పూర్ణిమ మృత దేహాన్ని తీసుకువెళ్లారని సదర్ పోలీసు అధికారి సచీంద్ర ప్రధాన్ వెల్లడించారు.

జిల్లా కేంద్రాస్పత్రిలో బాలింత మృతి