
లైంగిక వేధింపులపై ప్రజల ఆగ్రహం
కొరాపుట్: విద్యార్థినిపై లైంగిక వేధింపుల ఘటనకు సంబంధించి ప్రజలు ఆందోళనకు దిగారు. కొరాపుట్ జిల్లా నందపూర్ పోలీసు సబ్ డివిజన్ లమ్తాపుట్ సమితిలోని ప్రభుత్వ బాలికల సంక్షేమ స్కూల్లో ఏప్రిల్ 13వ తేదీన 8 ఏళ్ల విద్యార్థినిపై లైంగిక దాడి జరిగింది. ఈ విషయం పాఠశాల సిబ్బంది రహస్యంగా ఉంచి బాలికకు చికిత్స చేయించారు. కానీ ఆమె పరిస్థితి మెరుగుపడలేదు. దీంతో గత్యంతరం లేక ఏప్రిల్ 30వ తేదీన గుణయిపొడలోని బాలిక ఇంట్లో దింపి వెళ్లిపోయారు. బాలిక ఆరోగ్యం బాగోలేకపోవడంతో కుటుంబీకులు వైద్యం కోసం తీసుకొని వెళ్లగా విషయం వెలుగులోకి వచ్చింది. వెంటనే కొరాపుట్ జిల్లా ఎస్పీ రోహిత్ వర్మకు విషయం తెలియజేయడంతో దర్యాప్తునకు ఆదేశించారు. లమ్తాపుట్ సమితి కేంద్రంలో ఈ ఘటనపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో మూకుమ్మడిగా ఇళ్ల నుంచి ప్రజలు స్వచ్ఛందంగా ర్యాలీగా బయటకు వచ్చారు. ఆగ్రహంతో పోలీసుస్టేషన్ వద్దకు వెళ్లి నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఎస్డీపీవో దేవేంద్ర మాలిక్ స్పందించి కేసు దర్యాప్తు జరుగుతోందని తెలియజేశారు. సున్నితమైన కేసు కావడంతో వివరాలు ప్రకటించలేమన్నారు. మరోవైపు వివిధ శాఖల ఉన్నతాధికారులు ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్నారు.

లైంగిక వేధింపులపై ప్రజల ఆగ్రహం

లైంగిక వేధింపులపై ప్రజల ఆగ్రహం