
మోసగించిన కేసులో నలుగురు మహిళల అరెస్టు
రాయగడ: బంగారు ఆభరణాలకు మెరుగుపెడతామని చెప్పి మోసగించి బంగారు ఆభరణాలను అపహరించిన కేసులో కాశీపూర్ పోలీసులు నలుగురు మహిళలను శుక్రవారం రాత్రి అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో కటిని గిరి, మమిత గిరి, దుర్గా గిరి, విశ్వమణి గిరిలు ఉన్నారు. వీరి నుంచి పోలీసులు 34 గ్రాముల బంగారు ఆభరణాలతో పాటు ఒక మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకుని నిందితులను శనివారం కోర్టుకు తరలించారు. కాశీపూర్ సమితి లదాఖాన్ గ్రామంలో శుక్రవారం ఉదయం నలుగురు మహిళలు వెళ్లి బంగారు ఆభరణాలకు మెరుగుపడతామని నమ్మించారు. దీంతో గ్రామానికి చెందిన లావణ్య గౌడొ అనే మహిళ తన వద్ద గల రెండు తులాల బంగారు హారాన్ని మెరుగు పెట్టేందుకు ఇచ్చింది. అనంతరం మెరుగుపెట్టినట్లు నటించిన ఆ నలుగురు మహిళలు కొద్ది సేపటి తర్వాత ఒక కవరులో ప్యాక్ చేసి మెరుగు పెట్టినందుకు గాను కొంత మొత్తం డబ్బులు తీసుకుని వెళ్లిపోయారు. వారు వెళ్లిన తర్వాత మెరుగు పెట్టేందుకు ఇచ్చిన ప్యాకెట్ను ఓపెన్ చేసి చూడగా అందులో ప్లాస్టిక్ హారం ఉండటంతో మోసపోయానని భావించిన గౌడొ లబోదిబోమంటూ వెంటనే కాశీపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలొకి దిగిన పోలీసులు అదే రోజు సాయంత్రం ఆ నలుగురు మహిళలను పట్టుకుని అరెస్టు చేశారు.