
భద్రతా ఏర్పాట్లు పటిష్టం
భువనేశ్వర్:
ప్రపంచ ప్రఖ్యాత పూరీ రథయాత్ర కోసం పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఏడాది జూన్ 27న ఈ యాత్ర జరగనుంది. రథయాత్ర ఆద్యంతాలు సజావుగా, సమర్థంగా నిర్వహించేందుకు రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్ యోగేష్ బహదూర్ ఖురానియా అధ్యక్షతన ఒక ముఖ్యమైన సమావేశం జరిగింది. సోమవారం కటక్లోని రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. పోలీసు విభాగం సీనియర్ అధికారులు రథ యాత్ర సజావుగా జరిగేలా చురుగ్గా, అప్రమత్తంగా ఉండాలని డీజీపీ ఆదేశించారు. శ్రీ జగన్నాథ ఆలయ సంప్రదాయం ప్రకారం పలు ఉత్సవాలు, వేడుకలు చోటు చేసుకుంటాయి. ఈ కార్యక్రమాలు వివిధ తేదీల్లో నిర్వహిస్తారు. వాటిలో ప్రధానమైనవి జూన్ 11న దేవస్నాన పూర్ణిమ, జూన్ 26న నవ యవ్వన అలంకార దర్శనం, జూన్ 27న రథ యాత్ర, జూలై 01న హెరా పంచమి, జూలై 04న సంధ్యా దర్శనం, జూలై 05న బహుడా యాత్ర, జూలై 06న స్వర్ణ అలంకరణ, జూలై 07న ఒధొరొ పొణా మరియు జూలై 8న నీలాద్రి విజేగా పేర్కొన్నారు. ఈ సందర్భంగా, దేశం నలుమూలల నుంచి విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు పూరీని సందర్శిస్తారు. ఈ సందర్భంగా యాత్రికుల భద్రత కోసం విస్తృతమైన భద్రతా ఏర్పాట్లను ఈ సమావేశంలో చర్చించారు. రథ యాత్రకు భద్రతా ఏర్పాట్లను పెంచుతారు. ప్రత్యేకంగా సీనియర్ పోలీసు అధికారులను మోహరిస్తారు. పూరీ పట్టణంలో వివిధ ముఖ్యమైన ప్రదేశాలలో సీసీటీవీల ఏర్పాటు, రోడ్ డివైడర్లు, ట్రాఫిక్ నిర్వహణ కోసం డిలినేటర్లు, ట్రాఫిక్ జోన్ ఏర్పాట్లు, నగరంలోని వివిధ ప్రదేశాలలో తగినంత పార్కింగ్ ఏర్పాట్లు, క్రమబద్ధమైన ట్రాఫిక్ ఏర్పాట్ల నిర్వహణ మొదలైన వాటిపై సమావేశంలో చర్చించారు. పూరీ బీచ్లో పోలీసుల గస్తీ, తాత్కాలిక పోలీసు అవుట్పోస్టుల నిర్వహణపై సమీక్షించారు. దీంతో పాటు, పూరీ, భువనేశ్వర్, ఖుర్దారోడ్ రైల్వే స్టేషన్లలో రైల్వే పోలీసుల భద్రతా ఏర్పాట్లను రాష్ట్ర పోలీసు వర్గాలు చర్చించాయి. ఈ నేపథ్యంలో రైల్వే రక్షక దళంలో చక్కని సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర పోలీసు డైరెక్టరు జనరల్ సూచించారు. అన్ని పోలీస్ స్టేషన్లలో నేరస్థులపై ప్రత్యేక డ్రైవ్లు, హోటళ్లు, లాడ్జీలలో క్రమం తప్పకుండా తనిఖీలు, భద్రతా వాహనాల మోహరింపు, కె – 9 స్క్వాడ్ మోహరింపు, తొక్కిసలాట వంటి పరిస్థితులను నివారించడానికి అప్రమత్తమైన, ప్రత్యేక ఏర్పాట్లు, ప్రముఖ వ్యక్తుల కోసం ప్రత్యేక హెలిప్యాడ్, పోలీసు బలగాల వసతి కోసం ప్రత్యేక సౌకర్యాలు, వాహన రవాణా క్రమబద్ధీకరణ, బారికేడ్ ఏర్పాట్లు, జిల్లా యంత్రాంగం సహకారంతో వివిధ సమస్యలను త్వరగా పరిష్కరించడం, భక్తులకు క్రమబద్ధమైన దర్శనం కోసం ప్రత్యేక సౌకర్యాలకు అత్యంత ప్రాధాన్యత కల్పిస్తున్నారు. ఈ సమావేశంలో, డైరెక్టర్ (ఇంటెలిజెన్స్) ఆర్. పి. కోచే, అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సెక్యూరిటీ (ఆధునికీకరణ) సౌమేంద్ర కుమార్ ప్రియదర్శి, అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సెక్యూరిటీ (రైల్, కోస్తా భద్రత) అరుణ్ బోత్రా, అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సెక్యూరిటీ శాంతిభద్రతలు) సంజయ్ కుమార్, రవాణా కమిషనర్ అమితాబ్ ఠాకూర్, అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సెక్యూరిటీ (కమ్యూనికేషన్) దయాళ్ గంగ్వార్, అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సెక్యూరిటీ (ఎస్ఏపీ) రాజేష్ కుమార్, ఐజీ (సెంట్రల్ రీజియన్) ఎస్. ప్రవీణ్ కుమార్, ఐజీ (ఆపరేషన్స్) డాక్టర్ దీపక్ కుమార్, ఐజీ (బీపీఎస్ పీఏ) అనుప్ సాహు, ఐజీ (క్రైమ్ బ్రాంచ్) డాక్టర్ సార్థక్ సదాంగి, డీఐజీ (ప్రొవిజనింగ్) చరణ్ సింగ్ మీనా, డీఐజీ (ఎస్ఐడబ్ల్యూ) డాక్టర్ కన్వర్ హబీబ్ సింగ్, డీఐజీ (ఎస్ పీఎఫ్) పినాక్ మిశ్రా, పోలీసు సూపరింటెండెంట్ (రైల్వేస్) వివేకానంద్ శర్మ, పూరీ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ వినీత్ అగర్వాల్, అనేక మంది సీనియర్ పోలీసు అధికారులు పాల్గొన్నారు.