
కష్టార్జితం కాలిపోయింది..
కొత్తూరు: కష్టార్జితం కాలిపోయింది. కుమార్తె పెళ్లి కోసం దాచిపెట్టిన నగదు, బంగారం బూడిదైంది. దీంతో బాధితులు లబోదిబోమంటున్నారు. వివరాల్లోకి వెళ్తే.. మండల కేంద్రం కొత్తూరులోని కొత్తపేట కాలనీలో శుక్రువారం కొగాన పద్మావతి శుక్రవారం ఉదయం దేవుడి పటం వద్ద దీపం వెలిగించి ఉపాధి పనికి వెళ్లిపోయింది. ఇంతలో ఇంటి నుంచి ఒక్కసారిగా మంటలు రావడంతో స్థానికులు గమనించి అదుపు చేసేందుకు ప్రయత్నించారు. అనంతరం అగ్నిమాపక కార్యాలయానికి సమాచారం ఇవ్వడంతో సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపులోకి తీసుకొచ్చారు. అప్పటికే పద్మావతి కుమార్తె వివాహం కోసం ఇనుప పెట్టెలో దాచిన రూ. 2.80 లక్షల నోట్లు కాలిబూడిదయ్యాయి. తులంన్నర బంగారం, పిల్లల విలువైన పత్రాలు, దుస్తులు, నిత్యావసర సరుకులు కాలిపోయాయి. సర్వం కోల్పోయిన పద్మావతి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
కొత్తూరుకు చెందిన గోగుల చిట్టిబాబు బాధిత కుటుంబానికి బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.
అగ్ని ప్రమాదంలో పూరిల్లు దగ్ధం
కుమార్తె వివాహం కోసం దాచిన రూ.2.80 లక్షల నగదు బూడిద

కష్టార్జితం కాలిపోయింది..