బీపీయూటీ వీసీగా అమియకుమార్
భువనేశ్వర్: నగరంలోని బిజూ పట్నాయక్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ(బీపీయూటీ) నూతన వైస్ ఛాన్సలర్(వీసీ)గా ప్రొఫెసర్ అమియకుమార్ రథ్ నియమితులయ్యారు. విశ్వవిద్యాలయాల ఛాన్సలర్, రాష్ట్ర గవర్నర్ గణేషీలాల్ ఆమోదం మేరకు ఈ నియామకం జరిగింది. రథ్ ఈ హోదాలో ఐదేళ్ల పాటు కొనసాగుతారు. పదవీ బాధ్యతలు స్వీకరించిన నుంచి 5 ఏళ్ల పరిమితి లెక్కిస్తారు లేదా తదుపరి ఉత్తర్వులు జారీ అయ్యేంత వరకు పదవిలో కొనసాగుతారు. ప్రొఫెసర్ అమియకుమార్ బెంగళూరులోని నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్(నాక్)లో సలహాదారునిగా పని చేస్తున్నారు. అధ్యాపక రంగంలో సుదీర్ఘంగా 33 ఏళ్ల అనుభవం కలిగిన ఆయన.. వివిధ అంశాలపై తొమ్మిది పుస్తకాలను రచించాడు.
గంజాం బార్ ఎన్నికలు నేడు
● ఓటు హక్కు వినియోగించుకోనున్న 1,519మంది న్యాయవాదులు
బరంపురం: గంజాం బార్ అసోసియేషన్ 2023–24 ఎన్నికలు శనివారం జరగనున్నట్లు ఎన్నిలక అధికారి అక్షయ్కుమార్ పట్నాయక్ వెల్లడించారు. స్థానిక జిల్లా కోర్టు ప్రాంగణంలో ఎన్నికలకు సంబంధించి ఆయన ఎన్నికల కమిటీతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బార్ ఎన్నికలో 1,519మంది న్యాయవాదులు తమ పేర్లను రిజిస్టర్ చేసుకున్నారని తెలిపారు. అధ్యక్ష పదవికి 6 నామినేషన్లు, ఉపాధ్యక్ష పదవికి ఇద్దరు, కార్యదర్శి పదవికి ఆరుగురు, సహాయ కార్యదర్శిగా ముగ్గురు పోటీలో ఉన్నారని ప్రకటించారు. అభ్యర్థుల పేర్లతో బ్యాలెట్ నంబర్లు ముద్రించామన్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓటింగ్ నిర్వహించి, సాయంత్రం 5గంటల నుంచి లెక్కింపు చేపడతామన్నారు. తుది ఫలితం తేలిన వెంటనే విజేతలను ప్రకటిస్తామని వివరించారు.
జిల్లా కేంద్రంలో
పీహెచ్సీ ప్రారంభం
మల్కన్గిరి: జిల్లా కేంద్రంలో నూతన నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ విశాల్సింగ్ శుక్రవారం ప్రారంభించారు. జిల్లా కేంద్రాస్పత్రి మల్కన్గిరి కేంద్రానికి 2కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ నేపథ్యలో అత్యవసర సమయంలో ప్రజలకు సేవలందించేందుకు గాను నూతనంగా పీహెచ్సీ ఏర్పాటు చేసినట్లు జిల్లా వైద్యాధికారి ప్రఫుల్లకుమార్ నందొ తెలిపారు. వృద్ధుల సౌకర్యార్థం ప్రత్యేకంగా వైద్యుడు అందుబాటులో ఉంటారని ప్రకటించారు.
చైత్రోత్సవాలకు శ్రీకారం
రాయగడ: ఉత్తరాంధ్రుల ప్రజల ఇలవేల్పు మజ్జిగౌరి అమ్మవారి వార్షిక చైత్రోత్సవాలు ఏప్రిల్ 1నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఉత్సవాలకు నిర్వాహకలు శ్రీకారం చుట్టారు. దీనికి సంబంధించి ముహూర్తపు రాట పూజా కార్యక్రమాలను మందిరం ప్రాంగణంలో శుక్రవారం నిర్వహించారు. అమ్మవారి సేవకులు చంద్రశేఖర్ బెరుకొ ప్రత్యేక పూజలు చేపట్టారు. అనంతరం ముహూర్తపు రాట వేశారు. మందిర మేనేజింగ్ ట్రస్టీ రాయిసింగి బిడిక, సభ్యులు పెద్దిన వాసు, వడ్డాది శ్రీనివాస్రావు, దేవంద్ర బెహరా తదితరులు పాల్గొన్నారు. ఉత్సవాల్లో భాగంగా ఈనెల 31న సాయంత్ర స్థానిక జంఝావతి నది నుంచి శుద్ధ జలాలను తీసుకువచ్చి, అమ్మవారి మందిరంలో నిలుపుతారు. అనంతరం 5రోజుల పాటు ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ ఏడాది అమ్మవారి సంబరాలు ఘనంగా నిర్వహించేందుకు కమిటీ నిర్ణయించిందని నిర్వహకులు తెలిపారు.