పెనుగంచిప్రోలు: ఎన్టీఆర్ జిల్లాలో జగ్గయ్యపేట నియోజకవర్గంతో ప్రముఖ వేసవి దర్శనీయ క్షేత్రాలు ఎన్నో ఉన్నాయి. కళాత్మకంగా కనిపించే ఎన్నో ఆలయాలు పచ్చదనం పరుచుకున్న ప్రకృతి నడుమ కొలువు దీరి ఆధ్యాత్మికతను, ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. ఇక్కడ నిత్యం ఉత్సవాలతో ఆధ్మాత్మిక వాతావరణం వెల్లివిరుస్తుంది. భక్తుల సౌకర్యార్థ్యం ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేస్తున్నారు.
ముక్తేశ్వరుని సన్నిధి ముక్త్యాల
జగ్గయ్యపేటకు పది కిలో మీటర్ల దూరంలో ముక్త్యాల పుణ్య క్షేత్రం ఉంది. ఇక్కడ శ్రీభవానీ ముక్తేశ్వరస్వామి కొలువై ఉన్నారు. ఆలయం పక్కనే ముక్త్యాల రాజా వారి కోట ఉంది. కృష్ణానది ఇక్కడ ఉత్తర వాహినిగా ప్రవహించటం వల్ల ఈ ప్రదేశం పవిత్ర క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది.
శ్రీకోటిలింగ హరిహర క్షేత్రం
జగ్గయ్యపేటకు పది కిలో మీటర్ల దూరంలో ముక్త్యాలకు సమీపంలో శ్రీకోటిలింగ హరిహర క్షేత్రం ఉంది. ప్రధానాలయంలో పంచముఖ అమృతలింగేశ్వరస్వామి కొలుదీరి ఉంటారు. చుట్టూ శివలింగాలు ప్రతిష్ఠ జరుగుతోంది. ప్రధాన ఆలయం చుట్టూ ఎందరో దేవతామూర్తుల ఆలయాలు ఉన్నాయి.
భక్తుల కొంగుబంగారం శ్రీతిరుపతమ్మ
విజయవాడకు 60 కిలోమీటర్లు, జగ్గయ్యపేట, నందిగామకు 15 కిలోమీటర్లు దూరంలో పెనుగంచిప్రోలులో శ్రీతిరుపతమ్మవారి ఆలయం ఉంది. అమ్మవారు భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగా రంలా విరాజిల్లుతోంది. జిల్లాలో విజయవాడలోని శ్రీకనకదుర్గమ్మవారి ఆలయం తరువాత రెండో స్థానంలో ఉంది. ఆలయం పక్కన మునేరు, చుట్టూ మామిడి తోటలు ఎంతో ఆహ్లాదాన్ని పంచుతాయి. భక్తులకు వసతి సదుపాయాలు ఎప్పుడూ అందుబాటులో ఉంటాయి.


