లబ్బీపేట(విజయవాడతూర్పు): వాయు కాలుష్యం, వాతావరణ మార్పులతో అలెర్జీ కారకాలు, ఓజోన్లో మార్పులు, వేగవంతమైన పట్టణీకరణ వంటివి దీర్ఘకాలిక ఊపిరి తిత్తుల వ్యాధులకు దారితీస్తున్నట్లు పలువురు పల్మోనాలజిస్టులు పేర్కొన్నారు. వ్యాధులను నిర్ధారించడంలో జాప్యం జరగడంతో ముఖ్యంగా సీఓపీడీ (క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మోనరీ డీసీజ్) ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలోని ఓ హోటల్లో ఆదివారం ఏరోఫోర్స్ సంస్థ ఆధ్వర్యాన ఏరోకాన్ పేరుతో పల్మోనాలజిస్టుల సదస్సు జరిగింది. 250 మంది వరకు స్పెషాలిటీ వైద్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనేక అంశాలపై శాసీ్త్రయమైన చర్చలు జరిగాయి. ఏరోకాన్ కోర్స్ డైరెక్టర్ డాక్టర్ కె.అనీల్కుమార్ మాట్లాడుతూ వ్యాధిని ముందుగానే గుర్తించడానికి, నిర్వహణకు పలు సూచనలు చేశారు. రోగులు ప్రతిరోజూ మెరుగ్గా శ్వాస తీసుకోవడానికి అవగాహన, నిరంతర వైద్య విద్య ప్రాముఖ్యాన్ని వివరించారు. సదస్సులో నూతన పరిశోధనలు, చికిత్స ఫలితాలు వంటి వాటిని విశ్లేషించారు.
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): లోక కల్యాణార్థం దుర్గమ్మ సన్నిధిలో ఆదివారం సూర్యోపాసన సేవ జరిగింది. అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని రాజగోపురం వద్ద సూర్య భగవానుడి విగ్రహానికి ఆలయ అర్చకులు పూజలు చేశారు. అనంతరం సూర్య నమస్కారాలు, సూర్యోపాసన సేవను నిర్వహించారు. ఉభయదాతలను ప్రత్యేక క్యూలో అమ్మవారి దర్శనానికి అనుమతించారు.
కోనేరుసెంటర్: కృష్ణా జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యాన ప్రతి సోమవారం నిర్వ హించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ కోసం కార్యక్రమాన్ని ఈ నెల 11వ తేదీ సోమవారం యధావిధిగా నిర్వహించనున్నట్లు కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్నాయుడు తెలిపారు. సోమవారం ఉదయం 10.30 గంటలకు ప్రారంభమయ్యే కార్యక్రమంలో ప్రజలు సమస్యలను ఫిర్యాదుల రూపంలో అందజేయవచ్చని తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంతో పాటు జిల్లాలోని అన్ని పోలీస్స్టేషన్ల పరిధిలో జరుగుతుందని పేర్కొన్నారు. మీ కోసంలో అందిన ప్రతి అర్జీని చట్ట పరిధిలో విచారణ జరిపించి బాధితులకు న్యాయం చేస్తామని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ కోరారు.
గుడ్లవల్లేరు: భూ సమేత శ్రీ వేంకటేశ్వరాలయంలో స్వామివార్ల ఉత్సవ మూర్తులకు మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్(మెయిల్) అధినేత, దేవస్థాన వ్యవస్థాపక ధర్మకర్తలు పురిటిపాటి వేంకట కృష్ణారెడ్డి, సుధారెడ్డి దంపతుల ఆధ్వర్యంలో ఆలయ పండితులు కనులపండువగా ఊంజల సేవను చేశారు. అనంతరం ప్రత్యేక పూజలు చేసి స్వామివారికి పల్లకీ సేవను నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఆలయ నిర్వాహకులు కె.బాపిరెడ్డి, విజయ భాస్కరమ్మ దంపతులు తదితరులు ఉన్నారు.


