సంఘ రాష్ట్ర అధ్యక్షుడు సత్యనారాయణ
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): చాత్తాద శ్రీ వైష్ణవుల అభివృద్ధికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జె.సత్యనారాయణ డిమాండ్ చేశారు. విజయవాడ గాంధీనగర్ ప్రెస్క్లబ్లో ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏ విధమైన ప్రగతిలేని చాత్తాద శ్రీ వైష్ణవులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి బీసీ సబ్ ప్లాన్ నిధులు కేటాయించాలని కోరారు. రాష్ట్రంలో నాలుగు లక్షలకు పై చిలుకు జనాభా ఉన్న చాత్తాద శ్రీవైష్ణవులు కుల వృత్తులు దెబ్బతినడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తమ పిల్లల పైచదువులు భారంగా మారాయన్నారు. బీసీ రిజర్వేషన్లు పెద్ద కులాల మాత్రమే అందిపుచ్చుకుంటున్నారన్నారు. ప్రభుత్వం తమను విస్మరించిందన్న భావన కలుగుతోందన్నారు. ప్రభుత్వం స్పందించి విజయవాడ పరిసరాల్లో కమ్యూనిటీ హాల్ నిర్మించాలని, దేవాలయాల పాలకవర్గంలో, ఇతర నామినేటెడ్ పోస్టుల్లో ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. సమావేశంలో శ్రీరంగనాయక వేద విద్యాపీఠం గురువు టి.ఎం.సూరి, వైస్ ప్రెసిడెంట్ టి.వి.రమణ, జనరల్ సెక్రటరీ ఎం.రాంబాబు, వైస్ ప్రెసిడెంట్ ఎస్.నమ్మయ్య, టి.నారాయణమూర్తి, కృష్ణాజిల్లా ప్రెసిడెంట్ టి.శ్రీకాంత్, జనరల్ సెక్రటరీ ఎం.లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.


