చల్లపల్లి: నిలిపి ఉంచిన ఆటోలో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన రెండు రోజుల తరువాత బుధ వారం వెలుగు చూసింది. పోలీసుల కథనం మేరకు.. చల్లపల్లి ప్రధాన సెంటర్లో బందర్ రోడ్డులోని పెట్రోల్ బంక్ పక్కన వీధిలో మరమ్మతులకు గురైన ఆటో ఒకటి కొద్దిరోజులుగా నిలిపి ఉంది. బుధవారం ఉదయం ఆ ఆటోలో ఈగలు ముసురుతుండటంతో కొందరు దగ్గరకు వెళ్లి చూడగా ఓ వ్యక్తి మృతదేహం కనిపించింది. వారు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్ఐ దంపనబోయిన దుర్గాంజనేయులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుడిని చల్ల పల్లి మండలం పురిటిగడ్డ కాలనీకి చెందిన ప్రయివేటు ఎలక్ట్రీషియన్ మత్తి శోభనాద్రి(45)గా గుర్తించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. శోభనాద్రి తాగుడుకు బానిస కావటంతో అతని భార్య కొంత కాలంగా దూరంగా ఉంటోంది. ఈ నెల నాలుగో తేదీ రాత్రి 11 గంటల సమయంలో శోభనాద్రి పెట్రోల్ బంకు వద్ద రోడ్డుపై అటూ ఇటూ తిరగడం, ఆటోలోకి వెళ్లిన తరువాత బయటకు రాకపోవడం సమీపంలోని సీసీటీవీ పుటేజీలో రికార్డయింది. ఎస్ఐ దుర్గాంజనేయులు పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం మృత దేహాన్ని అవనిగడ్డ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
ఆటోలో శోభనాద్రి మృతదేహం
మృతదేహం ఉన్న ఆటో


