సమ్మర్‌ కోచింగ్‌ క్యాంపులను సమర్ధంగా నిర్వహించాలి | - | Sakshi
Sakshi News home page

సమ్మర్‌ కోచింగ్‌ క్యాంపులను సమర్ధంగా నిర్వహించాలి

May 6 2026 9:01 AM | Updated on May 6 2026 9:01 AM

సమ్మర్‌ కోచింగ్‌ క్యాంపులను సమర్ధంగా నిర్వహించాలి ఆటో పల్టీ.. ఏడుగురికి తీవ్రగాయాలు

శాప్‌ చైర్మన్‌ రవినాయుడు, ఎండీ భరణి

మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాప్‌) ఆధ్వర్యంలో 26 జిల్లాలో నిర్వహిస్తున్న సమ్మర్‌ కోచింగ్‌ క్యాంప్‌లను సమర్థవంతగా నిర్వహించాలని శాప్‌ చైర్మన్‌ అనిమిని రవినాయుడు, మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎస్‌.భరణి చెప్పారు. విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియం ఆవరణలోని శాప్‌ ప్రధాన కార్యాలయంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న సమ్మర్‌ కోచింగ్‌ క్యాంప్‌లపై 26 జిల్లాల్లోని డీఎస్‌డీవోలు, పీడీలు, పీఈటీలతో అధికారులతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. రవినాయుడు మాట్లాడుతూ కొన్ని జిల్లాలో క్యాంప్‌ల్లో క్రీడాకారుల సంఖ్య చాలా తక్కువగా నమోదు అయిందని, మరింత ఎక్కువ మంది శిక్షణ తీసుకునేలా డీఎస్‌డీవోలు చర్యలు తీసుకోవాల్సిందిగా సూచించారు. శిక్షణకు వచ్చిన వారి వివరాలను క్రీడా యాప్‌లో రిజిస్టర్‌ చేయాలన్నారు. క్యాంపులను అత్యుత్తమంగా నిర్వహించిన డీఎస్‌డీవో, పీడీ, పీఈటీలు, యూత్‌ సర్వీస్‌ అధికారులను ముగింపు సభలో సత్కరిస్తామన్నారు. డీఎస్‌డీవోలు, పీఈటీలు, యూత్‌ సర్వీస్‌ అధికారులు సమావేశంలో పాల్గొన్నారు.

కంచికచర్ల : ఈదురుగాలులకు రోడ్డుపై కూలిపోయిన చెట్టును తప్పించే క్రమంలో ఆటో పల్టీ కొట్టింది. అందులో ప్రయాణిస్తున్న ఏడుగురు తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ ఘటన మంగళవారం ఎన్టీఆర్‌ జిల్లా కంచకచర్ల మండలంలో చోటు చేసుకుంది. సేకరించిన వివరాల ప్రకారం... కంచికచర్లలో ఓ ఇంటి శ్లాబ్‌ వేసేందుకు ఇబ్రహీంపట్నం మండలం దాములూరు గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్‌ నడకుదిటి పోలీసు ఇబ్రహీంపట్నం మండలం దొనబండ గ్రామానికి చెందిన షేక్‌ మీరాబీ, కె.జానమ్మ, ఒడిశాకు చెందిన దొనబండలో నివాసం ఉండే సావిత్రి, కంచికచర్ల మండలం పరిటాల గ్రామానికి చెందిన కె.చంద్రతో పాటు మరో ఇద్దరు కార్మికులను ఆటోలో ఎక్కించుకుని కంచికచర్ల వస్తున్నాడు. రాత్రి సమయంలో ఈదురుగాలులు వీచటంతో పరిటాలలో రోడ్డుపక్కన ఉన్న చెట్టు రోడ్డుపై పడింది. దీంతో ఆటో డ్రైవర్‌ రోడ్డుపై పడిన చెట్టును తప్పించే క్రమంలో ఆటో పల్టీకొట్టింది. ఈ ఘటనలో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న కంచికచర్ల, నందిగామ 108 వాహన సిబ్బంది నలుగురు క్షతగాత్రులను నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరో ముగ్గురిని కంచికచర్ల పీహెచ్‌సీకి తరలించారు. ఆటో డ్రైవర్‌ కుడి చేయి విరిగింది. బాధితుల పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై తమకు సమాచారం అందలేని పోలీసులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement