పెనుగంచిప్రోలు: అకాల వర్షం, ఈదురు గాలులు మామిడి రైతులను నష్టపరిచింది. ఆదివారం సాయంత్రం అకస్మాత్తుగా వాతావరణం మారడం.. నల్లని మేఘాలు కమ్ముకుని వచ్చిన వర్షం గాలులకు మామిడి నేలరాలింది. కల్లాల్లో ఆరబోసిన మొక్కజొన్న, మిర్చి, ధాన్యం తడిసి పోయింది. అసలే అంతంత మాత్రం కాపు వచ్చిన మామిడి ఈదురు గాలులకు వర్షార్పణమైందని రైతులు వేదన చెందుతున్నారు. కల్లాల్లో ఆరబోసిన మొక్కజొన్న, మిర్చి పట్టాలు కప్పినా భారీ గాలికి కొట్టుకు పోయాయి. ఈఏడాది రబీసాగు చేస్తున్న రైతులతో పాటు, మామిడి, మొక్కజొన్న మీద ఆశలు పెట్టుకున్న రైతులందరికీ చేదు అనుభవమే ఎదురైంది. రైతులు తమ పంటలను కాపాడుకునేందుకు పట్టాలు కూడా ప్రభుత్వం అందించలేక పోతోందని అంటున్నారు. నష్టపోయిన రైతులకు ప్రభుత్వం సాయం అందించాలని కోరుతున్నారు. గాలులకు అనిగండ్లపాడు–గుమ్మడిదుర్రు రోడ్డులో మూడు విద్యుత్ స్తంభాలు కూలడంతో రాకపోకలతో పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మండలంలో పలు గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారు.


