బాధితురాలు విజయవాడ ప్రభుత్వ వైద్యశాలకు తరలింపు నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
బంగారు గొలుసు కోసం.. వృద్ధురాలిపై హత్యాయత్నం
పామర్రు: పమిడిముక్కల మండలం ధూళిపూడిపాలెంలో వృద్ధురాలికి ఉన్న బంగారు నగ కోసం స్థానికుడు హత్యాయత్నం చేసిన సంఘటనపై ఆదివారం కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పమిడిముక్కల మండలం ధూళిపూడి పాలెంకు చెందిన మైనేని సీతామహాలక్ష్మి వృద్ధురాలు. వేసవి కాలం కావడంతో ఇంటి వరండాలో శనివారం రాత్రి నిద్రకు ఉపక్రమించింది. అదే గ్రామానికి చెందిన ధూళిపూడి గురవయ్య అనే వ్యక్తి శనివారం అర్ధరాత్రి ఆమె ఇంటికి వెళ్లి నిద్ర పోతున్న సీతామహాలక్ష్మి మెడలో ఉన్న బంగారు గొలుసును లాగే ప్రయత్నం చేశాడు. ఆమె గట్టిగా కేకలు వేసింది. దీంతో భయపడిన దుండగుడు తనతో పాటు తెచ్చిన కొడవలితో ఆమె తలపై, చేతిపై గట్టిగా నరికాడు. ఇంతలో స్థానికులు అక్కడికి చేరుకోవడంతో గురవయ్య పరారయ్యాడు. విషయం తెలుసుకున్న పోలీసులు బాధిత మహిళను విజయవాడ ప్రభుత్వ హాస్పటల్కు తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉంది. స్థానికుల ఫిర్యాదుపై గురవయ్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పమిడిముక్కల మండలం ఎస్ఐ బి.శ్రీను తెలిపారు.
గుర్తు తెలియని మృతదేహం లభ్యం
కృష్ణలంక(విజయవాడతూర్పు): కృష్ణానదిలో గుర్తు తెలియని ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైన ఘటన కృష్ణలంక పీఎస్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు పద్మావతి ఘాట్ సమీపంలో రైల్వేట్రాక్ కింద కృష్ణానదిలో ఒక వ్యక్తి మృతదేహం తేలుతున్నట్లు ఆదివారం ఉదయం 9 గంటలకు సమాచారం అందింది. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుని వయస్సు 30 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండవచ్చని, ఊరు, పేరుకు సంబంధించి ఆధారాలు లభించలేదని పోలీసులు తెలిపారు. మృతుడు బ్లూకలర్ ఫుల్ అండర్వేర్, రెడ్ కలర్ మొలతాడు ధరించి ఉన్నాడని చెప్పారు. నదిలోకి స్నానానికి దిగి ప్రమాదవశాత్తు మునిగి మరణించి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఆచూకీ తెలిసిన వారు 94921 48188, 98498 08555 నంబర్లలో సంప్రదించాలని కోరారు.


